Man Who Killed A Rat By Drowning Could Be Jailed For 5 Years: ఉత్తర్ ప్రదేశ్ బుదౌన్ లో ఓ ‘‘ఎలుక హత్య’’ కేసు చర్చనీయాంశంగా మారింది. ఎలుకకు రాయి కట్టి నీటిలో పడేసిన వ్యక్తిపై యూపీ పోటీసులు 30 పేజీల ఛార్జిషీట్ దాఖలు చేశారు. వీటిని బుదౌన్ కోర్టులో మంగళవారం సమర్పించారు. ఎలుకకు సంబంధించి ఫోరెన్సిక్ వివారాలు, వివిధ సోర్సెస్ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఛార్జిషీట్ సిద్ధం చేసినట్లు సీఐ అలోక్ మిశ్రా వెల్లడించారు. ఎలుకకు సంబంధించి ఊపిరితిత్తులు, కాలేయం ఇన్ఫెక్షన్ ఉందని, ఉపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా ఊపిరి ఆడక చనిపోయిందని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది.
మనోజ్ కుమార్ అనే వ్యక్తి గతేడాది నవంబర్ 25న ఎలుక పట్ల క్రూరంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదు అందింది. కుమార్ ఎలుక తోకకు రాయిని కట్టి కాలువలో విసిరినట్లు జంతు కార్యకర్త వికేంద్ర శర్మ ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎలుకను కాపాడేందుక తాను కాలువలో దూకానని అయితే అది అప్పటికే చనిపోయినట్లు ఆయన పేర్కొన్నాడు. మంగళవారం సీనియర్ న్యాయవాది రాజీవ్ కుమార్ శర్మ మాట్లాడుతూ.. జంతువుల పట్ల క్రూరత్వ నిరోధక చట్టం కింద, రూ. 10 నుంచి రూ.2000 వరకు జరిమానా లేదా మూడేళ్లు జైలు శిక్ష, ఐపీసీ 429 ప్రకారం ఐదేళ్లు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ కూడా విధించే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
Read Also: Bombay High Court: “వైవాహిక వివాదాలు” మనదేశంలో తీవ్రమైన కేసులు..
అయితే మనోజ్ కుమార్ తండ్రి మధుర ప్రసాద్ మాత్రం ఎలుకలను, కాకులను చంపడం తప్పు కాదని, ఇది హానికరమైన ప్రాణులు అని అన్నారు. మట్టితో తయారు చేసిన పాత్రనలు ఎలుకలు పాడు చేస్తున్నాయని, దీంతో మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, నా కొడుకుపై చర్యలు తీసుకుంటే మేకలు, కోళ్లును చంపే వారిపై కూడా చర్యలు తీసుకోవాలి, ఎలుకలను చంపే రసాయనాలను విక్రయించే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నవంబర్ లో జరిగిన ఈ సంఘటనలో మొదటగా ఎలుక మృతదేహాన్ని శవపరీక్ష కోసం బుడాన్లోని వెటర్నరీ ఆసుపత్రికి పంపారు. అయితే అక్కడి సిబ్బంది నిరాకరించడంతో మృతదేహాన్ని బరేలీలోని ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐవీఆర్ఐ)కి పంపించారు. తర్వాత ఫోరెన్సిక్ పరీక్షలో ఎలుక ఊపిరితిత్తులు వాచిపోయి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా చనిపోయిందని తేలింది. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వల్ల ఊపిరి ఆడక ఎలుక చనిపోయిందని మా నిపుణులు నిర్ధారించారని ఐవీఆర్ఐ జాయింట్ డైరెక్టర్ కేసీ సింగ్ చెప్పారు.