Mallikarjun Kharge To Sworn Oath As AICC President On October 26: ఏఐసీసీ అధ్యక్ష పదవి ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన మల్లికార్జున్ ఖర్గే.. రేపు ఆ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి ఏఐసీసీ ప్రాంగణంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. రేపు ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రస్తుత – మాజీ సీడబ్ల్యూసీ సభ్యులు, ప్రస్తుత – మాజీ ఏఐసీసీ జనరల్ సెక్రటరీలు, సెక్రటరీలు, ప్రస్తుత – మాజీ ముఖ్యమంత్రులు, ప్రస్తుత – మాజీ పీసీసీ అధ్యక్షులు, ప్రస్తుత – మాజీ సీఎల్పీ లీడర్లు హాజరు కానున్నారు.
ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల నిర్వహణలో కీలక భాగస్వాములైన ప్రదేశ్ రిటర్నింగ్ ఆఫీసర్ల( పిఆర్ఓ)లతో పాటు అసిస్టెంట్ ఏపీఆర్ఓలు కూడా ఈ సమావేశానికి ఆహ్వానం అందుకున్నారు. ఏఐసీసీ అధ్యక్షురాలుగా సోనియా గాంధీ చేసిన సేవలకు గాను కృతజ్ఞతలు తెలిపే తీర్మానాన్ని ఈ సమావేశం ఆమోదించనుంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు.. ఏఐసీసీ సెంట్రల్ ఎన్నికల అథారిటీ ఛైర్మన్ మధుసూదన్ మిస్త్రీ, మల్లికార్జున్ ఖర్గేకు సర్టిఫికెట్ను అందజేయనున్నారు. ఆ తర్వాత ఏఐసీసీ అధ్యక్షుడి హోదాలో ఖర్గే తొలిసారిగా తొలిసారిగా పార్టీ నాయకులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు ఇప్పటికే చాలామంది కాంగ్రెస్ నేతలు వివిధ రాష్ట్రాల నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. అయితే.. అనారోగ్య రీత్యా మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్ ఈ సమావేశానికి గైర్హాజరయ్యే అవకాశం ఉంది.
కాగా.. ఏఐసీసీ అధ్యక్ష పదవి కోసం మల్లికార్జున్ ఖర్గే, శశి థరూర్ పోటీ పడిన సంగతి తెలిసిందే! అక్టోబరు 17వ తేదీన ఎన్నికలు నిర్వహించగా.. బుధవారం ఫలితాలను వెల్లడించారు. ఈ ఎన్నికల్లో దాదాపు 9500 ఓట్లు పోలవ్వగా.. ఖర్గేకు 7,897 ఓట్లు, థరూర్కు 1072 ఓట్లు పడ్డాయి. మరో 416 ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి. గాంధీ కుటుంబంతో పాటు సీనియర్లందరూ ఖర్గేకు మద్దతుగా ఉండటంతో.. ఆయన భారీ మెజారిటీ దక్కింది.