అలీనగర్ బీజేపీ ఎమ్మెల్యే, జానపద గాయని మైథిలి ఠాకూర్ బీహార్ అసెంబ్లీలో తొలి స్పీచ్తో సోషల్ మీడియాలో వైరల్ న్యూస్గా మారింది. ప్రస్తుతం బీహార్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. సోమవారం తన నియోజకవర్గంలోని ఆస్పత్రుల దుస్థితిపై ఆరోగ్య శాఖ మంత్రి మంగళ్ పాండేను ఎమ్మెల్యే ప్రశ్నించారు. తన నియోజకవర్గంలో ఆస్పత్రులు పరిస్థితి బాగోలేదని.. ఆస్పత్రి భవనం శిథిలావస్థకు చేరుకుందని.. పెద్ద ప్రమాదం జరిగేటట్లుగా ఉందని వివరించారు. పైకప్పు పెచ్చులు ఊడిపోతున్నాయని.. గోడల్లో లోతైన పగుళ్లు ఏర్పడ్డాయని వివరించారు. అంతేకాకుండా వర్షాకాలంలో వార్డుల్లోకి నీరు లీక్ అవుతుందని పేర్కొన్నారు. అయినప్పటికీ రోగులకు ఇప్పటికీ అదే భవనంలో చికిత్స అందిస్తున్నారని తెలిపారు. ఇక్కడే గర్భిణీ స్త్రీలు, చిన్నారులు ఉంటున్నారని.. ఇది ప్రజల ప్రాణాలకు చాలా ముప్పు వాటిల్లే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.
దీనికి ప్రతిస్పందనగా ఆరోగ్య మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆస్పత్రి భవనాల పరిస్థితిపై తీవ్రంగా దృష్టి పెడుతుందని అన్నారు. అనేక ఆస్పత్రులకు కొత్త భవనాలు మంజూరు అయ్యాయని.. కొన్ని ప్రదేశాల్లో నిర్మాణం పురోగతిలో ఉందని వివరించారు. శిథిలావస్థలో ఉన్న భవనాలు గుర్తించామని.. వాటిని దశలవారీగా మరమ్మతులు చేస్తామని లేదా పునరుద్ధరిస్తామని మంత్రి అన్నారు.
ఇది కూడా చదవండి: Tragedy : పెళ్లి వేడుకలో విషాదం.. స్విమ్మింగ్ పూల్లో పడి బాలుడి మృతి..
ఆరోగ్య మంత్రి నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో ఆమె మంత్రి గారి వివరణపై సంతృప్తి చెందలేదని.. సమాధానంపై పట్ల సంతోషంగా లేనట్లు చెప్పారు. ఎందుకంటే భవనం పరిస్థితి ఏ మాత్రం బాగోలేదు.. తక్షణమే మరమ్మతు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. తాను మరోసారి మంత్రిగారికి వివరించాలని అనుకుంటున్నట్లు తెలిపారు. తాను స్వయంగా భవనం పరిస్థితి చూశానని.. చిన్న గదిలో చికిత్సలు జరుగుతున్నాయని చెప్పారు. ఒక ఎంబీబీఎస్ డాక్టర్ కూడా లేరన్నారు. గతంలో ఇద్దరు డాక్టర్లు ఉండేవారని.. ఇప్పుడు లేరని వివరించారు. అయినా
ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఆరోగ్య బడ్జెట్ను పెంచుతుంటే ఆస్పత్రి భవనాలు ఎందుకు ఇంత దారుణంగా ఉన్నాయని మైథిలి ఠాకూర్ ప్రశ్నించారు. వైద్యులు, మందుల కొరత ఒక సమస్య అయితే.. అంతకంటే పెద్ద ముప్పు ఏ సమయంలోనైనా కూలిపోయే శిథిలావస్థలో ఉన్న భవనాలు ఉన్నాయని పేర్కొన్నారు. కొత్త భవనాలు నిర్మించే ముందు ప్రభుత్వం పెద్ద ప్రమాదం జరగాలని ఎదురు చూస్తుందా? అని ఎమ్మెల్యే అడిగారు.
మైథిలి ఠాకూర్ పదే పదే ప్రశ్నలు వేసిన తర్వాత సభలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మద్దతుగా టేబుల్ కొట్టగా.. అధికార పార్టీకి చెందిన కొందరు సభ్యులు అసౌకర్యంగా కనిపించారు. చర్చ ముందుకు సాగడానికి స్పీకర్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. చర్చకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కనిపించిన వెంటనే వైరల్గా మారింది. ప్రజల సమస్యలను చాలా గట్టిగా లేవనెత్తారని ప్రశంసలు వస్తున్నాయి. శిథిలావస్థలో ఉన్న ఆస్పత్రి భవనాలు బీహార్లోనే కాదు.. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఉన్నాయని నెటిజన్లు రాసుకొస్తున్నారు.
ఇది కూడా చదవండి: Cyber Crime: రూ.5 వేల కోట్ల ఆన్లైన్ గేమింగ్ స్కామ్.. ఆన్లైన్ గేమింగ్, ఫిన్టెక్ కంపెనీల ముసుగులో!
గత నవంబర్లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు జానపద గాయని మైథిలి ఠాకూర్ రాజకీయాల్లోకి వచ్చారు. అలీనగర్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. తాను మోడీ ప్రేరణతో రాజకీయాల్లోకి వచ్చినట్లు ఆమె తెలిపారు. మొత్తానికి తొలి స్పీచ్తోనే గాయని అదరగొట్టిందంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు అందుతున్నాయి.