Yogi Adityanath: ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కాశీ, మధుర, అయోధ్య గురించి మాట్లాడారు. రామ మందిర ప్రాణప్రతిష్ట జరిగిన కొన్ని రోజులు తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతనను సంతరించుకున్నాయి. అయోధ్య నగరాన్ని గత ప్రభుత్వాలు నిషేధాలు, కర్ఫ్యూల పరిధిలో ఉంచాయని, శతాబ్ధాలుగా అయోధ్యను నీచ ఉద్దేశాలతో తిట్టారని, ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా వ్యవహరించడం బహుశా మరెక్కడ చూడలేదని, అయోధ్యకు అన్యాయం జరిగిందని యోగి అన్నారు.
Read Also: Sharad Pawar: శరద్ పవార్ కొత్త పార్టీ.. ఈసీ గ్రీన్సిగ్నల్
‘‘ నేను అన్యాయం గురించి మాట్లాడేటప్పుడు, మేము 5,000 ఏళ్ల నాటి విషయం గుర్తుకు తెచ్చుకుంటాము. ఆ సమయంలో పాండవులకు కూడా అన్యాయం జరిగింది. అయోధ్య, కాశీ, మధురలోనూ అదే జరిగింది’’ అని యోగి అన్నారు. ‘‘ఆ సమయంలో కృష్ణుడు కౌరవుల వద్దకు వెళ్లి మాకు 5 గ్రామాలు ఇవ్వండి, మీ వద్ద ఉన్న భూమి అంతా మీరే ఉంచుకోండని, సగం అయినా న్యాయం చేయాలని కృష్ణుడు అడిగాడు, కానీ ఇక్కడ సమాజం వందల ఏళ్లుగా మూడు, కేవలం మూడు ప్రాంతాల గురించి మాట్లాడుతున్నారని, అయోధ్య, మధుర, వారణాసి గురించి ప్రస్తావించారు. ఈ మూడు స్థలాలు దేవుళ్ల అవతార ప్రదేశాలు’’ అని ఆయన అన్నారు.
అయోధ్య రాముడి జన్మస్థలంగా పరిగణించబడితే, మధుర శ్రీకృష్ణుడి జన్మస్థలంగా నమ్ముతారు. వారణాసిలోని జ్ఞానవాపి ప్రదేశం 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. అయితే, ఈ ప్రాంతా విషయంలో ఓటు బ్యాంకు రాజకీయాలు ఉన్నాయని, అవే వివాదానికి దారి తీస్తోందని, మేము మూడు స్థలాలు మాత్రమే అడిగాము, ఇతర స్థలాలతో ఎలాంటి వివాదం లేదని యోగి అన్నారు. వారణాసిలోని జ్ఞానవాపి సెల్లార్లో పూజలకు కోర్టు అనుమతించిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ప్రజలు అయోధ్యలో వేడుకలు చూస్తుంటే, నేను ఎందుకు వేచి ఉండాలని నందీబాబా అడిగారని అన్నారు. మహాశివుడి వాహనంగా నందిని సూచిస్తారు. పరోక్షంగా కాశీ విశ్వనాథ దేవాలయం గురించి యోగి ఆదిత్యనాథ్ ప్రస్తావించారు.