ఇవాళ రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుండటం, అలాగే ఢిల్లీలో విపక్ష పార్టీలు సమావేశం అవనుండటంతో… హస్తినలో జరిగే రాజకీయ పరిణామాలపై పొలిటికల్ సర్కిల్స్లో ఆసక్తి నెలకొంది. జులై 24వ తేదీన రాంనాథ్ కోవింద్ పదవీకాలం ముగియనుంది. 25వ తేదీలోపు కొత్త రాష్ట్రపతి ఎన్నుకోవాల్సి ఉంది. ప్రెసిడెంట్ ఎన్నికకు సంబంధించి… నేడు నోటిఫికేషన్ను విడుదల చేయనుంది కేంద్ర ఎన్నికల సంఘం. వచ్చే నెల 18న ఎన్నికలు, 21న ఓట్ల లెక్కింపు ఉండనుంది. ఎలక్టరోరల్ పద్ధతిలో రాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు ఎలక్టరోరల్ కాలేజీలో సభ్యులుగా ఉంటారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఉభయ సభల్లో నామినేటెడ్ సభ్యులకు ఓటు హక్కు ఉండదు. ప్రస్తుతం ఎలక్టోరల్ కాలేజీలో 776 ఎంపీలు ఉండగా.. వారి ఓట్ల విలువ 5,43,200గా ఉంది. ఇక 4033 ఎమ్మెల్యేలు ఉండగా.. వారి ఓట్ల విలువ 5,43,231గా ఉంది.
రాష్ట్రపతిని ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు… కేంద్రంలోని అధికార బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించింది. తాము నిలబెట్టే అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని.. కాంగ్రెస్, దాని మిత్రాలను కోరనుంది బీజేపీ. ఇందులో భాగంగా విపక్షాలతో చర్చల జరిపే బాధ్యతను జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు అప్పగించింది. విపక్షాలు అభ్యర్థిని నిలబెట్టకుండా.. తాము నిలిపే అభ్యర్థికే మద్దతు ఇవ్వాలని కోరేందుకు సిద్ధమయ్యాయి. ప్రెసిడెంట్ పదవికి పోటీ పడే అభ్యర్థిని ప్రకటించకుండా.. మద్దతు ఇవ్వాలని కోరడంపై విపక్షాలు మండిపడుతున్నాయి.
రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ వేగంగా అడుగులు వేస్తుంటే.. విపక్షాలు మాత్రం వెనుకబడ్డాయి. ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని కమలనాథులు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. తాము నిలబెట్టే అభ్యర్థికి.. కావాల్సిన ఓట్లు కూడగట్టడంలో కేంద్రంలోని బీజేపీకి పెద్ద విషయమేమీ కాదు. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులు భారీగానే గెలుపొందారు. దీంతో వారికి వచ్చే ఓట్ల సంఖ్య భారీగా పెరగనుంది. బీజేపీ బరిలోకి దింపే అభ్యర్థికి కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు మద్దతు ఇవ్వని పక్షంలో… తాము పోటీలోకి దించే అభ్యర్థిని కచ్చితంగా గెలిపించాలి. అయితే, బీజేపీకి వ్యతిరేకంగా మమతా బెనర్జీతో ఏయే పార్టీలు కలిసి వస్తాయన్నది ప్రశ్నార్థకంగా మారింది.
మమతా బెనర్జీ నిర్వహించే సమావేశానికి… ఏయే పార్టీల అధినేతలు వెళతారన్న దానిపై ఉత్కంఠ రేపుతోంది. 22 పార్టీలకు ఆహ్వానాలు పంపితే… కొన్ని పార్టీలు మాత్రమే స్పందించాయి. కాంగ్రెస్ పార్టీ తమ ప్రతినిధుల పేర్లను నిర్ణయించింది. టీఆర్ఎస్… సమావేశానికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. రాష్ట్రపతి ఎన్నికపై త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటామని కూడా టీఆర్ఎస్ ప్రకటించింది. ఇక ఆప్, శివసేన, జేఎంఎం, డీఎంకే, బీజేడీ పార్టీలు.. వెళ్తారా లేదా అన్న దానిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ సమావేశంలో పాల్గొనే పార్టీలు… వాటికున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు సంఖ్యను బట్టి.. రాష్ట్రపతి ఎన్నికల్లో గెలుపు ఎవరిదో తేలిపోనుంది. ఇక, ఆమ్ ఆద్మీ పార్టీ కూడా దీదీ సమావేశానికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
2017 రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రామ్నాథ్ కోవింద్కు 65.65శాతం ఓట్లు లభించాయి. అప్పట్లో బీజేపీ 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. శివసేన, అకాలీదళ్ వంటి పార్టీలు బీజేపీకి దూరమయ్యాయి. దాదాపు ఐదు లక్షల ఓట్లు ఎన్డీఏ అభ్యర్థికి లభించే చాన్స్ ఉంది. 2017లో దళిత వర్గానికి చెందిన రాంనాథ్ కోవింద్.. ఎన్డీఏ బరిలోకి దింపింది. కాంగ్రెస్ మిత్రపక్షాలు.. లోక్సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ను రంగంలోకి దించింది. రాంనాథ్ ఏకగ్రీవానికి మద్దతు ఇవ్వాలంటూ.. అన్ని రాజకీయ పార్టీలను కోరింది బీజేపీ. అయితే చివరి నిమిషంలో ప్రతిపాదన చేయడంతో.. ఎన్నికలు అనివార్యం అయ్యాయి
మొత్తం రాష్ట్రపతి ఎన్నికలు గతంలో ఎన్నడూ లేనంతగా వేడి రాజుకున్నాయి. ఇవాళ ఢిల్లీలో జరగనున్న విపక్ష పార్టీల సమావేశం… రాజకీయ వర్గాల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ భేటీకి నేతృత్వం వహిస్తున్న పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ విపక్ష పార్టీలను, ముఖ్యమంత్రులను ఆహ్వానించారు. మధ్యాహ్నం మూడు గంటలకు సమావేశం జరగనుంది. కాంగ్రెస్ పార్టీ తరఫున మల్లికార్జున ఖర్గే, సుర్జేవాలా, జైరాం రమేష్లు సమావేశానికి హాజరు కానున్నారు. అయితే కాంగ్రెస్తో వేదిక పంచుకోబోమని టీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేసింది. బీజేపీ, కాంగ్రెస్లకు సమదూరం పాటిస్తామని టీఆర్ఎస్ తేల్చిచెప్పింది. మరి మమత ఆహ్వానించిన వారిలో… సమావేశానికి ఎవరొస్తారో… ఎవరు డుమ్మా కొడతారో చూడాలి.