ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్లోని బెకాన్ గంజ్ ప్రాంతంలో శుక్రవారం చోటుచేసుకున్న హింసాకాండ వెనుక ఉగ్రవాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) హస్తం ఉండొచ్చని ఉత్తరప్రదేశ్ పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ హింసాత్మక ఘటనలకు సంబంధించి 800 మందికి పైగా కేసులు నమోదు చేశారు పోలీసులు. వీరిలో 24 మందిని అరెస్ట్ చేసి, 12 మందిని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీ, ఇతర వీడియో రికార్డింగ్ల ఆధారంగా హింసకు పాల్పడిన 36 మందిని గుర్తించామని వెల్లడించారు కాన్పూర్ పోలీస్ కమిషనర్ వీఎస్ మీనా. బేకన్గంజ్ ఎస్హెచ్వో నవాబ్ అహ్మద్, సబ్ ఇన్స్పెక్టర్ అసిఫ్ రజా ఫిర్యాదుల వివిధ సెక్షన్ల కింద వీరిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఘర్షణలకు సూత్రధారిగా అనుమానిస్తున్న మౌలానా మొహమ్మద్ అలీ(ఎంఎంఏ)జౌహార్ ఫ్యాన్స్ సోషల్ మీడియా గ్రూప్ చీఫ్ హయత్ జఫర్ హస్మితోపాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశామని పోలీసులు వెల్లడించారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)తదితర సంస్థలతో లింకులున్నట్లు తేలితే కఠినమైన జాతీయ భద్రతా చట్టంతోపాటు గ్యాంగ్స్టర్ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని కమిషనర్ మీనా పేర్కొన్నారు. విదేశీ నిధులు అందాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని, కుట్రదారుల ఆస్తులను జప్తు చేస్తామని ఆమె తెలిపారు.