NTV Telugu Site icon

Khalistani Terrorist: ఖలిస్తానీ ఉగ్రవాది పన్నూన్ హత్యకు భారత రా అధికారి కుట్ర చేశారు: అమెరికా

Kalisthan

Kalisthan

Khalistani Terrorist: గత ఏడాది ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌ను హతమార్చేందుకు భారత రా అధికారి కుట్ర పన్నారని అమెరికా న్యాయ శాఖ తీవ్ర ఆరోపణలు చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన సందర్భంగా ఈ దాడులు చేసేందుకు యత్నించారని ఫెడరల్ ప్రాసిక్యూటర్లు పేర్కొన్నారు. అయితే, పన్నూన్ హత్యకు కుట్ర చేసిన అధికారిని వికాస్ యాదవ్ (39)గా గుర్తించామని.. అతను భారత విదేశీ గూఢచార సేవ అయిన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా)లో పని చేశాడని చెప్పుకొచ్చింది. అలాగే, సదరు భారత రా ఏజెంట్ పన్నూన్ హత్యతో పాటు మనీ లాండరింగ్ కోసం ప్రయత్నించాడని అమెరికా న్యాయ శాఖ వెల్లడించింది.

Read Also: Railway Ticket Booking: ఇకపై 60 రోజుల ముందే రైలు బుకింగ్‌ల ముందస్తు రిజర్వేషన్

అయితే, పన్నూన్ హత్యకు కుట్ర పన్నిన ప్రధాన నిందితుడిగా నిఖిల్ గుప్తాను అమెరికా గుర్తించింది. అతను చెక్ రిపబ్లిక్లో అరెస్టు చేసిన తర్వాత అమెరికాకు అప్పగించబడ్డాడు. నిఖిల్ గుప్తా సదరు రా ఏజెంట్ వికాస్ యాదవ్ గురించి అమెరికన్ ఏజెన్సీలకు సమాచారం ఇచ్చారని పేర్కొనింది. కాగా, పన్నూన్ హత్య చేయమని భారతీయ అధికారి (కోడ్ పేరు-సిసిఒన్) తనకు సూచించారని నిఖిల్ గుప్తా స్వయంగా చెప్పాడని యూఎస్ ఏజెన్సీలు వెల్లడించాయి. పన్నూ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలపై భారత ‘ఇన్వెస్టిగేటివ్ కమిటీ’ కూడా దర్యాప్తు చేస్తుంది.

Read Also: RSS: ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమంలో కత్తులతో దాడి.. పలువురికి గాయాలు

ఇక, అమెరికాలో ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌ను హతమార్చేందుకు విఫలమైన కుట్రకు సంబంధించి భారత దర్యాప్తు కమిటీతో గురువారం జరిగిన సమావేశం సానుకూలంగా ఉందని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తెలిపారు. వారి విచారణ, సహకారంతో మేము సంతృప్తి చెందాము.. రా అధికారి వికాస్ యాదవ్ ఇకపై భారత ప్రభుత్వ ఉద్యోగి కాదని కూడా మిల్లర్ వెల్లడించారు. కాగా, ఖలీస్థాన్ ఉగ్రవాది పన్నూన్‌ను భారత ప్రభుత్వం ఇప్పటికే ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. అయితే అతను కెనడా- అమెరికాలలో నిరంతరం భారత వ్యతిరేక ర్యాలీలు, ఇతర కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు. పన్నూన్ స్థాపించిన సిక్కు ఫర్ జస్టిస్ అనే సంస్థను భారతదేశం నిషేధించింది.