India Pakistan War: పాకిస్తాన్ తన తీరు మార్చుకోవడం లేదు. భారత్ చేతిలో చావు దెబ్బలు తింటున్నా.. యుద్ధానికే సిద్ధపడుతోంది. వరసగా రెండో రోజు కూడా డ్రోన్లతో భారత భూభాగాలపై దాడులు చేసేందుకు ప్రయత్నించింది. జమ్మూకాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని సరిహద్దు ప్రాంతాల్లో దాడులకు యత్నించింది. ఈ దాడులను భారత క్షిపణి రక్షణ వ్యవస్థ తిప్పికొట్టింది.
Read Also: India-Pak War : జమ్మూలో పేలుళ్లు.. సైరన్ లు వినిపిస్తున్నాయి : సీఎం ఒమర్ అబ్దుల్లా
సాంబ సెక్టార్ ,జమ్మూ, పఠాన్ కోట్, పోఖ్రాన్లో మరోసారి డ్రోన్లు కనిపించాయి. జమ్మూ, సాంబా సెక్టార్, పఠాన్ కోట్లో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ డ్రోన్లను కూల్చేసింది. ఈ నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాల్లో ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. మొత్తం 11 లొకేషన్లలో పాక్ డ్రోన్ అటాక్స్ నిర్వహించింది. ఫిరోజ్పుర్లో జనావాసాల మీద డ్రోన్ల దాడి కారణంగా పలువురు పౌరులకు గాయాలు అయ్యాయి.
ఇప్పటి వరకు 100కు పైగా పాక్ డ్రోన్లను భారత భద్రతా దళాలు కూల్చేశాయి. ఇదిలా ఉంటే, ఎల్ఓసీ వెంబడి పాక్ రేంజర్లు కాల్పులకు తెగబడుతున్నారు. దీనికి ధీటుగా భారత సైన్యం బదులిస్తోంది. యూరీ, కుప్వారా, పూంచ్, నౌగామ్ సెక్టార్లలో పాక్ కాల్పులు జరిపుతోంది. జైసల్మేర్, అమృత్ సర్, జమ్మూ కాశ్మీర్ పూర్తిగా బ్లాక్ అవుట్ పరిస్థితులు ఏర్పడ్డాయి. తాను ఉన్న ప్రాంతంలో కూడా కాల్పుల శబ్ధాలు వినిపించినట్లు జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా చెప్పారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు.