UAPA Terrorists List: మరో కఠిన నిర్ణయం.. 23 మంది పేర్లను ఉగ్రవాదుల జాబితాలో చేర్చిన కేంద్రం

Terrorists

Terrorists

UAPA Terrorists List: ఉగ్రవాదంపై కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA) కింద 23 మంది వ్యక్తులను ఉగ్రవాదులుగా ప్రకటిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పేర్లను UAPA నాలుగో షెడ్యూల్‌లో 58 నుంచి 80 వరకు క్రమ సంఖ్యలతో చేర్చింది. వీరిలో ఎక్కువ మంది జైష్-ఎ-మొహమ్మద్, లష్కర్-ఎ-తైబా వంటి ఉగ్రవాద సంస్థలకు అనుబంధంగా ఉండి, పాకిస్థాన్ లేదా పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో 2016లో నగ్రోటా సైనిక శిబిరంపై జరిగిన ఉగ్రదాడి, 2022లో జమ్మూలోని సుంజ్‌వాన్ ప్రాంతంలో భద్రతా బలగాలపై జరిగిన దాడులతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మసూద్ ఇలియాస్ కాశ్మీరీ, మహమ్మద్ ముసాదిక్, ముఫ్తీ మహమ్మద్ అస్గర్ ఖాన్, హాఫిజ్ అబ్దుల్ షకూర్ తదితరుల పేర్లు ఉన్నాయి. అలాగే లష్కర్-ఎ-తైబాతో సంబంధం ఉన్న అబ్దుల్ రౌఫ్, హాఫిజ్ ఖాలిద్ వలీద్ పేర్లను కూడా జాబితాలో చేర్చారు. వీరు లష్కర్ వ్యవస్థాపకుడు హాఫిజ్ మహమ్మద్ సయీద్‌కు సన్నిహితులుగా కేంద్రం పేర్కొంది. మరోవైపు బెంగళూరుకు చెందిన మహమ్మద్ షాహిద్ ఫైసల్ అలియాస్ ఉస్తాద్, అలియాస్ జాకిర్ ప్రస్తుతం పాకిస్థాన్‌లోని రావల్పిండిలో ఉంటున్నట్లు గెజిట్ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

ప్రభుత్వం ప్రకారం, మహమ్మద్ షాహిద్ ఫైసల్‌కు లష్కర్-ఎ-తైబా, అల్-ఖైదా, ఐసిస్‌కు అనుబంధంగా ఉన్న మాడ్యూళ్లతో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సోషల్ మీడియా ద్వారా యువతను ఉగ్రవాద సంస్థల్లోకి ఆకర్షించడం, ఆయుధాల శిక్షణకు సహకరించడం, ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమీకరించడం వంటి చర్యల్లో పాల్గొన్నట్లు పేర్కొంది. హోం మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, ఈ వ్యక్తులు ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నారనే ఆధారాల మేరకు UAPA సెక్షన్-35 కింద వారి పేర్లను నాలుగో షెడ్యూల్‌లో చేర్చినట్లు వెల్లడించింది. ఈ జాబితాలో పేర్లు చేర్చడంతో వారి ఆస్తులపై చర్యలు, ఆర్థిక లావాదేవీలపై ఆంక్షలు, ఇతర చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఈ గెజిట్ నోటిఫికేషన్‌ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ రాకేష్ రాఠీ జారీ చేశారు. ఉగ్రవాదాన్ని అణిచివేసే దిశగా కేంద్రం తీసుకున్న మరో కీలక చర్యగా దీనిని అధికారులు పేర్కొంటున్నారు.