దేశంలో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టింది. నిన్న 5,476 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న కరోనా వల్ల 158 మంది ప్రాణాలు కోల్పోయారని వివరించింది. నిన్న కరోనా నుంచి 9,754 మంది కోలుకున్నారని పేర్కొంది. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటోన్న వారి సంఖ్య 59,442గా ఉందని తెలిపింది. ఇప్పటి వరకు కరోనా నుంచి మొత్తం కోలుకున్నవారి సంఖ్య 4,23,88,475కు పెరిగింది.
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 178.83 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేశారు. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతూనే వుంది. చిన్నపిల్లలకు కూడా కరోనా వ్యాక్సిన్ వేయడం ప్రారంభిస్తే కేసులు మరింతగా తగ్గుతాయని భావిస్తున్నారు. అయితే, శాస్త్రవేత్తలు మాత్రం కోవిడ్ ముప్పు ఇంకా తగ్గిపోలేదని, మరో వేవ్ త్వరలో రాబోతుందని షాకింగ్ అంశాలు బయటపెట్టారు. కోవిడ్ 19 వరుసగా మూడు వేవ్లుగా ఇండియాలో విజృంభించింది. థర్డ్వేవ్ ప్రాణాంతకం కాకపోయినా..సెకండ్ వేవ్ మాత్రం విలవిల్లాడించింది. వేలాదిమందిని బలితీసుకుంది. థర్డ్ వేవ్ లో ప్రాణనష్టం తక్కువగా ఉండటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
కరోనా సెకండ్ వేవ్ నుంచి థర్డ్వేవ్ ప్రారంభమయ్యేందుకు 6 నెలల సమయం పట్టింది. అటు కోవిడ్ ఫస్ట్వేవ్ నుంచి సెకండ్ వేవ్ ప్రారంభమయ్యేందుకు 4-5 నెలల సమయం పట్టింది. కరోనా థర్ద్వేవ్తో మహమ్మారి ముగిసిపోతుందని భావిస్తుంటే ఇటీవల కాన్పూర్ ఐఐటీ పరిశోధకులు జూన్లో ఫోర్త్ వేవ్ ప్రారంభం అవుతుందంటున్నారు.జూన్ నెలలో ప్రవేశించి..అక్టోబర్ వరకూ ఫోర్త్ వేవ్ వుండబోతుంది. అయితే, తీవ్రత గురించి అంతగా అంచనా వేయలేదు. ఈ నాలుగు నెలల్లో వ్యాక్సినేషన్ వేగవంతం అయితే తీవ్రత అంతగా వుండకపోవచ్చంటున్నారు.