India Pakistan: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రవాద దాడి భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల్ని పెంచింది. 26 మంది అమాయకపు టూరిస్టుల్ని లష్కరే తోయిబా ఫ్రాక్సీ ‘‘ది రెసిస్టెన్స్ ఫోర్స్(టీఆర్ఎఫ్)’’ ఉగ్రవాదులు కాల్చి చంపారు. మతం ఆధారంగా మారణహోమానికి పాల్పడ్డారు. అయితే, ఉగ్రవాద దాడిలో పాకిస్తాన్ ప్రమేయం స్పష్టంగా కనిపిస్తోంది. దాడిలో ముగ్గురు పాకిస్థానీ ఉగ్రవాదులు పాల్గొన్నారు. ఇప్పటికే, భారత్ పాకిస్తాన్పై దౌత్య చర్యలు మొదలుపెట్టింది. పాక్ జీవనాడి అయిన సింధు నదికి సంబంధించి ‘‘సింధు జలాల ఒప్పందం’’ రద్దు చేసుకుంది.
Read Also: Mani Sharma – Bheems : అప్పటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్తో భీమ్స్ ముచ్చట్లు!
ఇదిలా ఉంటే, మంగళవారం కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఎక్స్ అకౌంట్ని భారత్ బ్లాక్ చేసింది. ప్రపంచ ఉగ్రవాదానికి పాక్ సహకరించిందని ఆసిఫ్ ఇటీవల ఒప్పుకోవడంతో భారత్ నుంచి ఈ చర్య వచ్చింది. గత వారం స్కై న్యూస్ ఇంటర్వ్యూలో..‘‘పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలకు మద్దతు, శిక్షణ, నిధులు అందించే చరిత్ర ఉంది’’ అని అంగీకరించాడు. తాము సుమారుగా మూడు దశాబ్దాలుగా అమెరికా, బ్రిటన్ వెస్ట్రన్ దేశాల కోసం ఈ నీచమైన పని చేస్తున్నాము అని అన్నారు.
ఇదే విషయాన్ని భారతదేశం ఐక్యరాజ్యసమితిలో లేవనెత్తింది. ఐక్యరాజ్యసమితిలో భారతదేశ డిప్యూటీ శాశ్వత ప్రతినిధి యోజన పటేల్ మాట్లాడుతూ.. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంలో పాకిస్తాన్ తన ప్రమేయాన్ని స్పష్టంగా ఒప్పుకున్నట్లు అభివర్ణించారు. ఇప్పటికే, భారత్ 63 మిలియన్ల సబ్స్క్రైబర్ బేస్ కలిగిన 16 పాకిస్తానీ యూట్యూబ్ ఛానెల్లను నిషేధించింది. ఈ చర్య వచ్చిన ఒక రోజు తర్వాత పాక్ రక్షణ మంత్రి ఎక్స్ అకౌంట్ని భారత్ బ్యాన్ చేసింది.