తాను పాకిస్థాన్ వెళ్లనని.. తాను ప్రస్తుతం భారతీయ కోడలినని.. తనను ఇక్కడే ఉండనివ్వాలని సీమా హైదర్ విజ్ఞప్తి చేసింది. పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత పాకిస్థాన్ వీసాలను కేంద్రం రద్దు చేసింది. ఏప్రిల్ 29లోపు అందరూ వెళ్లిపోవాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ జాతీయురాలైన సీమా హైదర్ ఒక వీడియో విడుదల చేసింది. పాకిస్థాన్ వెళ్లే ఉద్దేశం లేదని.. తనను ఇక్కడే ఉండేందుకు అనుమతి ఇవ్వాలని ప్రధాని మోడీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను సీమా హైదర్ వేడుకుంది. ఈ మేరకు భర్త, పిల్లలతో కలిసి వీడియోను విడుదల చేసింది.
ఒకప్పుడు తాను పాకిస్థాన్ కూతురిని.. కానీ ఇప్పుడు భారతీయ కోడలినని తెలిపింది. సచిన్ మీనాను పెళ్లి చేసుకున్నాక.. తాను హిందూ మతాన్ని స్వీకరించినట్లు చెప్పుకొచ్చింది. దయచేసి తనను మాత్రం పాకిస్థాన్కు పంపించొద్దని సీమా హైదర్ విజ్ఞప్తి చేసింది.
ఇక ఇదే అంశంపై సీమా హైదర్ లాయర్ స్పందించారు. సీమా హైదర్ ప్రస్తుతం పాకిస్థాన్ జాతీయురాలు కాదని.. ఆమె భారతదేశంలో ఉండటానికి అనుమతి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆమె ప్రస్తుతం గ్రేటర్ నోయిడాలో సచిన్ మీనాతో కలిసి సంసారం చేస్తుందని.. ఇటీవలే బిడ్డకు కూడా జన్మనిచ్చిందని గుర్తుచేశారు. ఆమె పౌరసత్వం.. భర్తతో ముడిపడి ఉందని.. కేంద్ర ఆదేశాలు ఆమెకు వర్తించవని న్యాయవాది పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Attari Border: భర్త పాకిస్థానీ.. భార్య హిందుస్థానీ.. వారి పరిస్థితి గందరగోళం?
పబ్జీ ద్వారా సచిన్ మీనాతో సీమా హైదర్ ప్రేమలో పడింది. 2023లో కరాచీ నుంచి నేపాల్ మీదగా భారత్కు వచ్చేసింది. నలుగురు పిల్లలతో భారత్లోకి అక్రమంగా అడుగుపెట్టింది. అనంతరం ప్రియుడు సచిన్ మీనాను పెళ్లి చేసుకుని హిందూ మతంలోకి మారింది. అనంతరం తనకు భారతదేశ పౌరసత్వం కల్పించాలని రాష్ట్రపతికి ఆమె పిటిషన్ పెట్టుకుంది.
అయితే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్పై భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాలను నిలిపివేసింది. అలాగే వీసాలను రద్దు చేసింది. అనంతరం అటారీ సరిహద్దును మూసివేసింది. ఇక ఏప్రిల్ 29లోపు పాకిస్థానీయులు ఖాళీ చేసి వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశించింది. ఈ నేపథ్యంలో సీమా హైదర్.. కేంద్రానికి వినతి పెట్టుకుంది. దయతో తనను పంపించొద్దని కుటుంబ సభ్యులతో కలిసి వేడుకుంది. దీనిపై కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
ఇది కూడా చదవండి: Bilawal Bhutto: సింధూ నదిలో భారతీయుల రక్తం పారుతుంది.. భారత్పై భుట్టో పిచ్చికూతలు..