NTV Telugu Site icon

Delhi: మరో ఉద్యోగిని బలి తీసుకున్న పని ఒత్తిడి.. హెచ్‌డీఎఫ్‌సీ ఎంప్లాయి అనుమానాస్పద మృతి!

Hdfcemployee45dies

Hdfcemployee45dies

పని ఒత్తిడి కారణంగా ఉద్యోగులు మరణించడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే ఈవై ఉద్యోగిని అధిక పని కారణంగా తనువు చాలించింది. ఈ ఘటన యావత్తు భారతీయల హృదయాలను కలిచి వేసింది. కనీసం ఆమె అంత్యక్రియలకు ఒక్క ఎంప్లాయి కూడా హాజరు కాలేదు. ఈ అంశం మరింత దిగ్భ్రాంతి కలిగించింది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో కూడా ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. పని ఒత్తిడి కారణంగా కార్యాలయంలోనే ఊపిరి వదిలింది. తాజాగా ఇది రెండో మరణం కావడంతో.. పని పేరుతో కార్యాలయాల్లో ఉద్యోగులు ఎంత ఒత్తిడికి గురవుతున్నారో అన్న అంశంపై తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని విభూతిఖండ్‌ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఉద్యోగి సదాఫ్ ఫాతిమా (45) పని చేస్తూనే ప్రాణాలు వదిలింది. కుర్చీ పైనుంచి కిందపడిన వెంటనే మరణించింది. దీంతో తోటి ఉద్యోగులు షాక్‌కు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టానికి తరలించారు. పోస్టుమార్టం రిపోర్టు తర్వాత ఫాతిమా మరణంపై స్పష్టత వస్తుందని విభూతిఖండ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాధారామన్ సింగ్ తెలిపారు. అనుమానాస్పద స్థతిలో మరణించినట్లుగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. పని ఒత్తిడి కారణంగానే ఫాతిమా చనిపోయిందని సహచర ఉద్యోగులు వాపోయారు.

ఇక ఇదే అంశంపై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ.. ఇది అత్యంత ఆందోళనకర అంశం అని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో కార్యాలయాల్లో పని ఒత్తిడి పెరిగిందని తెలిపారు. కంపెనీలు, ప్రభుత్వ కార్యాలయాలు పని ఒత్తిడిపై పునఃపరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. తాజా విషాదాన్ని చూసైనా కంపెనీలు, ప్రభుత్వ విభాగాలు ఆలోచించాలని కోరారు. ఇలాంటి ఘటనలు మానవ మనుగడకు తీరని నష్టమని అఖిలేష్ ఎక్స్‌‌లో పోస్టు చేశారు.

ఇదిలా ఉంటే ఈవై ఉద్యోగిని మృతిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. పిల్లలను చదువుతో పాటే పని ఒత్తిడిని తట్టుకునేలా తయారు చేయాలని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై విపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు గుప్పించాయి.