Gold Scam : తక్కువ ధరకే విదేశీ బంగారం ఇప్పిస్తానంటూ అమాయకులను నమ్మించి లక్షలాది రూపాయలు వసూలు చేసిన ‘గోల్డ్ మ్యాన్’ సూర్య భాయ్ను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని హిమాయత్నగర్, నీలోఫర్ ప్రాంతాలకు చెందిన బాధితుల నుండి దాదాపు రూ.30 లక్షలు వసూలు చేసిన సూర్య భాయ్, ఆ తర్వాత బంగారం ఇవ్వకుండా ముఖం చాటేశాడు. బాధితులు అతడి ఇంటికి వెళ్లి నిలదీయడంతో.. తన వద్ద ఉన్న మూడు ఐఫోన్ల విలువ రూ.10 లక్షలని చెబుతూ వాటితో పాటు రూ.20 లక్షల నకిలీ చెక్కు ఇచ్చి పంపించేశాడు. ఆ తర్వాత అంతటితో ఆగకుండా, బాధితులే తనను బెదిరించి ఫోన్లు లాక్కెళ్లారంటూ ఏకంగా వారిపైనే పోలీసులకు ఫిర్యాదు చేసి నయా డ్రామాకు తెరతీశాడు. అయితే, బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేయగా సూర్య భాయ్ చేసిన అసలు మోసం బయటపడింది.
ఈ కేసును తదుపరి విచారణ నిమిత్తం నారాయణగూడ పోలీస్ స్టేషన్కు బదిలీ చేయడంతో, అరెస్ట్ భయంతో సూర్య భాయ్ హైదరాబాద్ నగరం విడిచి పారిపోవడానికి ప్రయత్నించాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టగా, హైదరాబాద్ నుంచి షాద్నగర్ వైపు పారిపోతుండగా పోలీసులు అతడిని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు ఈ ‘గోల్డ్ మ్యాన్’ను రిమాండ్కు తరలించి, ఇప్పటివరకు ఇతడు ఎంతమందిని ఇలా బురిడీ కొట్టించాడనే కోణంలో నిశితంగా విచారిస్తున్నారు. అమాయక ప్రజలు ఇటువంటి గుడ్డి నమ్మకాలతో తక్కువ ధర బంగారమంటూ వచ్చే మోసగాళ్లను నమ్మి డబ్బులు పోగొట్టుకోవద్దని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరిస్తున్నారు.

