Union Minister: రాష్ట్రంలో డీఎంకే పాలనలో అవినీతి రాజ్యమేలుతోందని.. రాష్ట్రంలో ఒకే ఒక్కసారి బీజేపీకి అధికారం కట్టబెడితే.. అవినీతి రహిత పాలన అందిస్తామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తమిళనాడు రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీజేపీ తొమ్మిదేళ్ల పాలన గురించి ప్రజలకు వివరించేందుకు స్థానిక తాంబరంలో బీజేపీ పార్టీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో రాజ్నాథ్సింగ్ మాట్లాడుతూ… స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దేశాభివృద్ధి తక్కువగా జరిగిందని.. కానీ ప్రధాని మోదీ అధికారం చేపట్టిన తర్వాత దేశాభివృద్ధి వేగవంతమైందన్నారు. కొత్త పార్లమెంటు భవనంలో సెంగోల్ (రాజదండం) ఏర్పాటు తమిళనాడుకు సరికొత్త అధ్యాయం సృష్టించిందన్నారు. అందువల్ల సెంగోల్ ప్రాముఖ్యత ప్రపంచానికే తెలిసిందని కేంద్ర మంత్రి అన్నారు. రాష్ట్రానికే వన్నె తెచ్చిన సెంగోల్ను పార్లమెంటు భవనంలో ఏర్పాటు చేసిన ప్రధానికి కృతజ్ఞతలు తెలపాలని రాజ్నాథ్ పిలుపునిచ్చారు.
Read also: Revanth Reddy: నేడు పొంగులేటి, జూపల్లితో రేవంత్ రెడ్డి కీలక భేటీ
కొవిడ్ కాలంలోనే ఆర్థికాభివృద్ధి మందగించకుండా కాపాడిన వ్యక్తి ప్రధాని మోదీ అన్నారు. తమిళం ప్రపంచంలోనే ప్రాచీన భాష అని, తిరువళ్లువర్ సహా పలువురు పండితులను అందించిన భూమి తమిళనాడని రాజ్నాథ్ సింగ్ గుర్తు చేశారు. దేశంలోని అన్ని భాషలకు తమిళం తల్లిలాంటిదని తెలిపారు. 2047 నాటికి ప్రపంచంలోనే అతి శక్తివంత దేశంగా భారత్ ఆవిర్భవించ నుందన్నారు. దేశంలోని ప్రతి వ్యక్తి ఆదాయం పెరుగుతోందని, ప్రపంచమే భారత్ బాటలో పయనిస్తోందన్నారు. ప్రధాని మోదీ తిరుక్కురల్ను మార్గదర్శిగా భావిస్తున్నారన్నారు. సెల్ఫోన్ ఉత్పత్తి, వినియోగంలో చైనాను మించిన దేశంగా భారత్ నిలిచిందన్నారు. రాష్ట్రంలో స్టాలిన్ నేతృత్వంలో ప్రభుత్వం పాల్పడుతున్న అవినీతిని దేశ ప్రజలందరూ గమనిస్తున్నారని అన్నారు. డీఎంకే పాలనలో అవినీతి భారీస్థాయులో జరుగుతోందన్నారు. ప్రజల సంక్షేమమే బీజేపీ అజెండా కాగా, మిగిలిన పార్టీలకు అధికారమే అజెండాగా ఉందని విమర్శించారు. రక్షణ పరికరాలు దిగుమతి చేసుకొనే దేశంగా భారత్ ఉండేదని, ప్రస్తుతం రక్షణ పరికరాలు ఉత్పత్తి, ఎగుమతి చేస్తున్న దేశాల జాబితాలో తొలి 25 స్థానాల్లో భారత్ ఒకటిగా నిలిచిందన్నారు.
Read also: US President Son: అమెరికా అధ్యక్షుడి కొడుకుకి జైలు శిక్ష..!
సెంథిల్ బాలాజి వ్యవహారంలో ముఖ్యమంత్రి స్టాలిన్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని కేంద్ర మంత్రి విమర్శించారు. రాజకీయ అవినీతి కారణంగా సెంథిల్ బాలాజిని అరెస్ట్ చేశారని సీఎం ఆరోపిస్తున్నారని.. కానీ వాస్తవానికి అవినీతి కేసులో అతను అరెస్టయ్యారని రాష్ట్ర ప్రజలకు తెలుసని అన్నారు. సోషల్ మీడియాలో అభిప్రాయాలు తెలిపిన తమ పార్టీకి చెందిన ఎస్జీ సూర్యను ఎందుకు అరెస్ట్ చేశారో సీఎం స్టాలిన్ చెప్పాలన్నారు. రాష్ట్రంలో అన్నాడీఎంకే కూటమిలో ఉన్నామని, కూటమి ధర్మాన్ని పాటించి అన్నాడీఎంకేకు తగిన మర్యాద ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. పేద ప్రజల సంక్షేమ కోసం శ్రమించిన జయలలిత అంటే బీజేపీకి ప్రత్యేక అభిమానం ఉందన్నారు. బీజేపీలో అవినీతికి పాల్పడే వారు జైలుకు వెళ్లక తప్పదని కేంద్ర మంత్రి రాజ్నాధ్ సింగ్ తెలిపారు.