Gita Gopinath: దీర్ఘకాలిక యుద్ధం జరిగితే ప్రపంచానికే ప్రమాదం.. గీతా గోపినాథ్ హెచ్చరిక

  • దీర్ఘకాలిక యుద్ధం జరిగితే ప్రపంచానికే ప్రమాదం
  • IMF మాజీ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపినాథ్ హెచ్చరిక
Gita Gopinath

Gita Gopinath

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) మాజీ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్ హెచ్చరించారు. యుద్ధం ఎలా ముగుస్తుందనే విషయంలో ఇప్పటికీ తీవ్ర అనిశ్చితి నెలకొని ఉందని పేర్కొన్నారు.

ప్రస్తుతం మార్కెట్లు పశ్చిమాసియాలో దీర్ఘకాల యుద్ధం కొనసాగే ప్రమాదాన్ని పూర్తిస్థాయిలో పరిగణనలోకి తీసుకోవడం లేదని అభిప్రాయపడ్డారు. ఈ యుద్ధం మరో నెల రోజుల పాటు కొనసాగితే ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 120 నుంచి 140 డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. అంతేకాకుండా ఆ ధరలు చాలా కాలం పాటు అధిక స్థాయిలో కొనసాగే ప్రమాదం ఉందన్నారు.

×
×
Ad

అలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం 3.1 శాతంగా అంచనా వేస్తున్న ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు 2.5 శాతానికి, కొన్ని సందర్భాల్లో 2 శాతానికి కూడా పడిపోవచ్చని గీతా గోపీనాథ్ హెచ్చరించారు. అయితే పరిస్థితులు త్వరగా చక్కబడతాయని, శాంతి ఒప్పందం కుదురుతుందనే ఆశాభావం మార్కెట్లలో ఇంకా కనిపిస్తోందని పేర్కొన్నారు. పశ్చిమాసియా సంక్షోభం ప్రభావం ప్రపంచంలోని వివిధ ప్రాంతాలపై భిన్నంగా ఉంటోందని చెప్పారు.

భారత్‌పై సుంకాల ప్రభావం


భారత్‌పై అమెరికా విధించే అవకాశమున్న సెక్షన్ 301 సుంకాల అంశంపైనా గీతా గోపీనాథ్ స్పందించారు. భారత్‌ను 301 జాబితా నుంచి తొలగించేందుకు ఎలాంటి షరతులు ఉండబోతున్నాయో.. అదనపు సుంకాలు విధిస్తారా లేదా అనే అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందన్నారు. ఈ సుంకాలు కేవలం భారత్‌కే కాకుండా అమెరికాకు కూడా ప్రతికూల ప్రభావం చూపుతాయని తెలిపారు. అమెరికాలోకి దిగుమతి అయ్యే వస్తువులపై ఇప్పటికే విధించిన సుంకాల కారణంగా ద్రవ్యోల్బణం పెరిగినట్లు కనిపిస్తోందన్నారు. 2025 నుంచి అమెరికా వాణిజ్య విధానాలను పరిశీలిస్తే అవి ఊహించలేని విధంగా తరచూ మారుతున్నాయని, అందువల్ల భారత్‌పై వాస్తవంగా ఎలాంటి సుంకాలు అమలు అవుతాయో తెలుసుకోవాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందేనని వ్యాఖ్యానించారు.

ప్రపంచ మార్కెట్లను నడిపిస్తున్న ఏఐ బూమ్


ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ అమెరికా, దక్షిణ కొరియా, తైవాన్ వంటి దేశాల మూలధన మార్కెట్లు రికార్డు స్థాయిల్లో కొనసాగుతున్నాయనే అంశంపై కూడా గీతా గోపీనాథ్ స్పందించారు. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లను ముందుకు నడిపిస్తున్న ప్రధాన శక్తి కృత్రిమ మేధస్సు (AI) అని తెలిపారు. ఒకవైపు పశ్చిమాసియా సంక్షోభం ఉన్నప్పటికీ మరోవైపు అమెరికా, దక్షిణ కొరియా, తైవాన్ వంటి దేశాల్లో భారీ స్థాయిలో ఏఐ పెట్టుబడులు పెరుగుతున్నాయని చెప్పారు. ఏఐ భవిష్యత్తులో ప్రపంచాన్ని పూర్తిగా మార్చివేసే సాంకేతికతగా భావిస్తున్న పెట్టుబడిదారులు పెద్ద మొత్తంలో నిధులు పెట్టుబడి పెడుతున్నారని వివరించారు. అందుకే ప్రపంచంలో ఇతర ప్రతికూల పరిణామాలు ఉన్నప్పటికీ స్టాక్ మార్కెట్ల విలువలు అత్యధిక స్థాయిలో ఉన్నాయని పేర్కొన్నారు.

అమెరికా ఆర్థిక వృద్ధిలో ఏఐ కీలక పాత్ర పోషిస్తోందని, ఇటీవల నమోదైన అమెరికా వృద్ధిలో దాదాపు సగం భాగం ఏఐ, ఏఐ సంబంధిత పెట్టుబడుల నుంచే వచ్చిందని తెలిపారు. డేటా సెంటర్ల నిర్మాణం, చిప్‌లు, డేటా ప్రాసెసర్లలో పెట్టుబడులు భారీగా పెరుగుతున్నాయని చెప్పారు. అమెరికా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక భాగం కావడంతో అక్కడి ఏఐ వృద్ధి ప్రభావం ప్రపంచంలోని ఇతర దేశాలపైనా పడుతోందని గీతా గోపీనాథ్ అభిప్రాయపడ్డారు.