Punjab: పంజాబ్ ఆప్ ఎమ్మెల్యే దేవిందర్జీత్ లడ్డీ ధోసే చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మోగాలో ఆరోగ్య సౌకర్యాలు అందుబాటులో లేకపోవడంపై ఆయన సొంత ప్రభుత్వంపైనే విమర్శలు గుప్పించారు. మోగా జిల్లాపై పంజాబ్ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమని చూపిస్తోందని అన్నారు. మోగా కోసం ఆరోగ్యమంత్రి కొత్త ప్రాజెక్టుని ప్రకటించకపోవడంతో ధోసే ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల్లో మాట్లాడుతూ.. ‘‘మోగాపై వివక్ష ఎందుకు..? మేము పాకిస్తాన్లో నివసిస్తున్నట్లుగా నాకు అనిపిస్తోంది’’ అని ధరమ్కోట్ ఎమ్మెల్యే ధోస్ అన్నారు. ధరంకోట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసే ప్రణాళికలు లేవని పంజాబ్ ఆరోగ్య మంత్రి బల్బీర్ సింగ్ చెప్పిన తర్వాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధోసే విమర్శలు చేశారు. ధరమ్కోట్లో ట్రామా సెంటర్ ప్రారంభించే ప్రతిపాదన లేదని ఆరోగ్య మంత్రి స్పష్టం చేశారు. దీంతో ధోసే ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
Read Also: PM Modi: రామేశ్వరంలో మోడీ శ్రీరామనవమి వేడుకలు.. అదే రోజు ‘‘పంబన్’’ వంతెన ప్రారంభం..
రాష్ట్రవ్యాప్తంగా జలంధర్, పఠాన్కోట్, ఖన్నా, ఫిరోజ్పూర్, ఫజిల్కా ప్రాంతాల్లో 5 ట్రామా సెంటర్లు పనిచేస్తున్నాయని ఆరోగ్యమంత్రి చెప్పారు. మంత్రి ప్రకటనపై ఆగ్రహించిన ధోసే, ధరమ్కోట్ వెనకబడిన ప్రాంతమని, నియోజకవర్గానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై ఆగ్రహించారు. కోట్ ఇసే ఖాన్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో 8 మంది వైద్యుల పోస్టులకు రెండు మాత్రమే భర్తీ చేశారని సభలో చెప్పారు.
ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం పంజాబ్ రాష్ట్రంలో రాజకీయ దుమారానికి దారి తీశాయి. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న పంజాబ్లో ఆప్ ప్రభుత్వంపై బీజేపీ, కాంగ్రెస్ దాడిని తీవ్రం చేశాయి. సొంత పార్టీ ఎమ్మెల్యే నుంచే ప్రభుత్వంపై విమర్శలు రావడంపై సిగ్గుచేటని కాంగ్రెస్ విమర్శించింది.