EPFO: ఈపీఎఫ్ ఖాతాల్లో ఉద్యోగుల సొమ్ము పేరుకుపోయి ఉంది. ఇన్యాక్టివ్ ఈపీఎఫ్ ఖాతాల్లో ఎవరూ క్లెయిమ్ చేయని సొమ్ము వేల కోట్లలో ఉన్నట్లు తేలింది. సుమారుగా 31 లక్షల ఇన్యాక్టివ్ ఖాతాల్లో రూ. 9330 కోట్లకు పైగా ఉద్యోగుల సొమ్ము ఉన్నట్లు ఆర్టీఐ ద్వారా వెల్లడైంది. కేంద్ర ప్రభుత్వం కొత్త ఈపీఎఫ్ స్కీమ్ -2026ను అమలులోకి తీసుకొచ్చిన నేపథ్యంలో ఈ సమాచారం ప్రాధాన్యత సంతరించుకుంది. మార్చి 31, 2026 నాటికి దేశవ్యాప్తంగా 30,91,862 ఇనాపరేటివ్ ఈపీఎఫ్ ఖాతాలు ఉన్నాయని EPFO వెల్లడించింది. ఉద్యోగులు ఉద్యోగం మారడం, అకౌంట్లను విలీనం చేయకపోవడం లేదా అకౌంట్లలో ఉన్న డబ్బును క్లెయిమ్ చేయకపోవడం వంటి కారణాలతో ఈ నిధులు చాలా ఏళ్లుగా ఖాతాల్లోనే ఉన్నాయి.
మార్చి 2025 నాటికి 31.38 లక్షల ఖాతాల్లో రూ. 10,181 కోట్లు క్లెయిమ్ చేయకుండా ఉండగా, 2026లో ఖాతాల సంఖ్య సుమారుగా 92 వేల మేర తగ్గి, అకౌంట్లలో ఉన్న డబ్బు రూ. 851 కోట్లకు తగ్గి రూ. 9330 కోట్లకు చేరింది. అయినప్పటికీ ఇంకా క్లెయిమ్ చేయని డబ్బు భారీగానే ఉంది. ఈ అన్క్లెయిమ్ డబ్బుతో ఏకంగా మూడు ఐఐటీలను నిర్మించొచ్చు. ఈ మొత్తం కేంద్ర ప్రభుత్వం పథకం ఉడాన్పై ఖర్చు చేసిన దానికి దాదాపుగా సమానం. ఆయుష్మాన్ భారత్–PM-JAY 2026-27 వార్షిక కేటాయింపుతో కూడా దాదాపు సమానంగా ఉంది.
ఇదిలా ఉంటే, గత ఆరు ఆర్థిక సంవత్సరాల ఇనాపరేటివ్ ఖాతాల వివరాలనున కోరగా, 2025-26లోనే ఇనాపరేటివ్ అకౌంట్స్ సెల్ ఏర్పాటు చేసినందున అంతకుముందు సంవత్సరాల వివరాలు తమ వద్ద లేవని ఈపీఎఫ్ఓ తెలిపింది. జూన్ 29 నుంచి కొత్త ఈపీఎఫ్ స్కీమ్ -2026 అమలులోకి వచ్చింది. దాదాపు 8 కోట్ల మంది యాక్టివ్ ఈజీఎఫ్ఓ సభ్యులకు మరింత డిజిటల్, సరళమైన సేవల్ని అందించడానికి ఈ కొత్త విధానాన్ని తీసుకువచ్చింది.

