Site icon NTV Telugu

PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు

Pm Modi

Pm Modi

ఈ రోజు ఉదయం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ‘ఉగ్రవాది’ అని వ్యాఖ్యానించిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేపై అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, కిరణ్ రిజిజు, అర్జున్ రామ్ మేఘ్వాల్, పలువురు ఇతర బీజేపీ నాయకులతో కూడిన ప్రతినిధి బృందం ఎన్నికల సంఘం పూర్తి ధర్మాసనానికి ఫిర్యాదు చేసింది. తన వ్యాఖ్యలకు బహిరంగంగా క్షమాపణ చెప్పేలా కాంగ్రెస్ అధ్యక్షుడిని ఆదేశించాలని బీజేపీ ఎన్నికల సంఘాన్ని కోరింది.

మోడీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) తీవ్రంగా పరిగణించింది. మోడీపై ‘ఉగ్రవాది’ వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు భారత ఎన్నికల సంఘం బుధవారం నోటీసులు జారీ చేసింది. ఈ వ్యాఖ్య ఎన్నికల నిబంధనల ఉల్లంఘన అయ్యే అవకాశం ఉందని పేర్కొంటూ, 24 గంటల్లోగా మల్లికార్జున్ ఖర్గే వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం కోరింది.

కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు ఫిర్యాదు చేసిన కొన్ని గంటలకే, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలపై 24 గంటల్లోగా స్పందన తెలియజేయాలని కోరుతూ ఎన్నికల సంఘం ఆయనకు నోటీసు జారీ చేసింది. ఇటీవల చెన్నైలో జరిగిన విలేకరుల సమావేశంలో ఖర్గే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ‘ఉగ్రవాది’ అని అభివర్ణించారు. మోదీ ప్రజలను, రాజకీయ పార్టీలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఖర్గే తెలిపారు.

కమిషన్‌కు సమర్పించిన మెమోరాండంలో, ఖర్గే చేసిన వ్యాఖ్యలకు గాను భారత శిక్షా స్మృతి (ఐపీసీ)లోని వివిధ సెక్షన్ల కింద తగిన శిక్షాత్మక, నియంత్రణ చర్యలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఖర్గేను విమర్శిస్తూ, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ, కాంగ్రెస్ అధ్యక్షుడి వ్యాఖ్యలు అవమానకరమైనవి మాత్రమే కాకుండా, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రమాదకరమైన దాడి అని మండిపడ్డారు.

Exit mobile version