మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే మరో ఎత్తుగడ వేస్తున్నారా? మళ్లీ ఉద్ధవ్కు ఎసరు పెట్టబోతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. శివసేనకు చెందిన ఒక నేత మాట్లాడిన వ్యాఖ్యలను బట్టి జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
మహారాష్ట్రలో షిండే మరో భారీ దెబ్బ కొట్టడం ఖాయమని వార్తలు వస్తున్నాయి. దాదాపు ఏడుగురు ఉద్ధవ్ థాక్రే ఎంపీలు.. షిండే శిబిరంలో చేరవచ్చని తెలుస్తోంది. శివసేన (యూబీటీ)కి చెందిన ఏడుగురు ఎంపీలు తమతో టచ్లో ఉన్నారని.. తమతో కలిసి పని చేయాలని కోరుకుంటున్నారని.. అలాగే ఎమ్మెల్యేల్లో 16 మంది కూడా తమతో సంప్రదింపులు జరుపుతున్నారని శివసేన ఎమ్మెల్సీ కృపాల్ తుమనే తెలిపారు. ‘ఆపరేషన్ టైగర్’ కింద ఏడుగురు శివసేన (యూబీటీ) లోక్సభ ఎంపీల చర్చలు తుది దశకు చేరుకున్నాయని పేర్కొన్నారు. త్వరలోనే వారంతా షిండేతో కలవనున్నట్లు చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇండియా కూటమికి మరో ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందని స్పష్టమవుతోంది.
శివసేన అంచనాల ప్రకారం.. రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు ఉద్ధవ్ థాక్రేకు చెందిన ఎంపీలు ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వైపు ఫిరాయించే అవకాశం ఉందని… ఒకవేళ ఈ పరిణామం కార్యరూపం దాల్చితే.. అది లోక్సభలో ఎన్డీఏ బలాన్ని మరింత పెంచుతుంది. వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యేలోపే ఈ పరిణామం చోటుచేసుకుంటుందని శివసేన ఎమ్మెల్సీ సూచించారు.
గతంలో ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వాన్ని ఏక్నాథ్ షిండే చీల్చి బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు మరోసారి ఉద్ధశ్ థాక్రే భారీ దెబ్బ కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

