DMK: తమిళనాడు ఎన్నికల ఫలితాల తర్వాత డీఎంకే, కాంగ్రెస్ మధ్య దూరాన్ని మరింత పెరిగింది. కూటమిగా పోటీ చేసి గెలిపిస్తే, ఓడిపోయిన తర్వాత విజయ్తో కాంగ్రెస్ చేరడాన్ని డీఎంకే జీర్ణించుకోలేకపోతోంది. డీఎంకేకు కాంగ్రెస్ నమ్మకద్రోహం చేసిందని, ఇకపై ఆ పార్టీని నమ్మేది లేదని స్టాలిన్తో పాటు ఉదయనిధి స్టాలిన్ బహిరంగంగానే వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉంటే, లోక్సభలో కాంగ్రెస్తో కూర్చునేందుకు డీఎంకే నిరాకరించింది. ఇప్పటికే జూన్ 8న జరుగబోతున్న ఇండియా కూటమి మీటింగ్ను డీఎంకే బాయ్కాట్ చేసింది. లోక్సభలో కాంగ్రెస్ నుంచి వేరుగా, ప్రత్యేక సీటింగ్ కావాలని డిమాండ్ చేసిన డీఎంకేకు ఆమోదం లభించినట్లు తెలుస్తోంది. డీఎంకే తరుపున కనిమొళి, లోక్సభలో ప్రత్యేక సీటింగ్ కావాలని కోరారు. సంబంధిత వర్గాల ప్రకారం, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డీఎంకే అభిప్రాయాలను, డిమాండ్లను లోక్సభ స్పీకర్కు తెలియజేసింది. సీటింగ్పై స్పీకర్ తుది నిర్ణయం తీసుకుంటారు.
ప్రస్తుతం, టీఎంసీ ఎంపీలు ఉన్న మూడో బ్లాక్కు డీఎంకే సభ్యుల్ని తరలించనున్నారు. ప్రస్తుతం అభిషేక్ బెనర్జీకి కేటాయించిన ముందు వరసలోని 354వ నంబర్ సీటును డీఎంకే నేత టీఆర్ బాలుకు కేటాయించే అవకాశం ఉంది. డీఎంకే ఎంపీలు కూర్చున్న స్థానాలకు టీఎంసీ ఎంపీలను తరలించే అవకాశం ఉంది.
ఈ వ్యవహారం ఇలా ఉంటే, ఇండియా కూటమి సమావేశాన్ని డీఎంకే బాయ్కాట్ చేసింది. జూన్ 8న జరిగే ఈ సమావేశానికి హాజరుకాబోమని ప్రకటించింది. కాంగ్రెస్ పాల్గొంటున్న కారణంగా ఈ సమావేశాన్ని బహిష్కరించాలని డీఎంకే నిర్ణయించింది. తమిళనాడు ఎన్నికల్లో 5 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్, డీఎంకేను వదిలేసి విజయ్ టీవీకేకు మద్దతు ఇచ్చింది. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ మార్క్ చేరుకునేందుకు సహకరించింది. అప్పటి నుంచి రెండు పార్టీల మధ్య స్నేహం దెబ్బతింది.
