Tamil Nadu Elections: తమిళనాడు ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందనే క్లారిటీ వచ్చింది. ఈరోజు (శనివారం) డీఎంకే కూటమి తన పొత్తుల్ని ఖరారు చేసింది. మొత్తం 234 నియోజకవర్గాల్లో డీఎంకే 164 సీట్లలో పోటీ చేస్తుంటే, మిగిలిన 70 స్థానాలను తన మిత్రపక్షాలకు కేటాయించింది. కూటమిలో ఉన్న కాంగ్రెస్కు 28 సీట్లు, డీఎండీకేకు 10 సీట్లు, వీసీకేకు 8 సీట్లు, సీపీఐ, సీపీఎంలకు చెరో 5 స్థానాలు, ఎండీఎంకేకు 4 స్థానాలు కేటాయించింది.
Read Also: Gas Cylinder Robbery: గ్యాస్ సిలిండర్లతో డెలివరీ బాయ్ పరార్..
కొలత్తూరు నుండి డీఎంకే అధినేత, సీఎం స్టాలిన్ తిరిగి పోటీ చేస్తున్నారు.ఆయన కుమారుడు, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ తన సొంత నియోజకవర్గమైన చెపాక్-తిరువల్లికేణి నుంచి బరిలోకి దిగారు. సెంథిల్ బాలాజీ ఈసారి కరూర్ నుంచి కోయంబత్తూర్ సౌత్కు మారారు. మంత్రులు కేఎన్ నెహ్రూ తిరుచ్చి వెస్ట్ నుంచి, టీఆర్బీ రాజా మన్నార్గుడి, పెరియసామి దిండిగల్ నుంచి పోటీ చేస్తున్నారు. డీఎంకే 164 మంది అభ్యర్థుల్లో 60 మంది కొత్తవారికి అవకాశం కల్పించారు. 18 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు.
మరోవైపు, ఎన్డీయే కూటమి పొత్తులు కూడా ఇప్పటికే ఖరారయ్యాయి. అన్నాడీఎంకే 169 స్థానాల్లో, బీజేపీ 27 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. భాగస్వామ్యంలో ఉన్న పీఎంకే 18, ఏఎంఎంకే 11 సీట్లలో పోటీకి దిగనున్నాయి. ఏప్రిల్ 23న తమిళనాడు ఎన్నికలు ఒకే విడతలో జరుగుతాయి. మే 04న ఫలితాలు వెల్లడవుతాయి.