NTV Telugu Site icon

NEET: నీట్ పరీక్షకు వ్యతిరేకంగా తమిళనాడులో డీఎంకే సంతకాల ప్రచారం..

Mk Stalin

Mk Stalin

NEET: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)కి వ్యతిరేకంగా తమిళనాడులో అధికార డీఎంకే పార్టీ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా సంతకాల ప్రచారాన్ని ప్రారంభించింది. సీఎం ఎంకే స్టాలిన్ తొలి సంతకం చేశారు. నీట్ పరీక్షను గత కొంత కాలంగా తమిళనాడు వ్యతిరేకిస్తోంది. ముఖ్యంగా అధికార డీఎంకే పార్టీ, సీఎం స్టాలిన్ ఈ పరీక్షలను రద్దు చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఈ ప్రచారం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 50 రోజుల్లో 50 లక్షల సంతకాలు సేకరించాలని డీఎంకే లక్ష్యంగా పెట్టుకుంది.

నీట్ పరీక్షను బీజేపీ రాజకీయం చేసిందని ఆరోపిస్తూ.. గత కొన్ని నెలలుగా నీట్ పరీక్ష నిర్వహణకు వ్యతిరేకంగా స్టాలిన్ నిరసనలు తెలుపుతున్నారు. నీట్ సామాజిక విరుద్ధమని, ఇది పట్టణ విద్యార్థులకు, కోచింగ్ సెంటర్లలో చదువుకునే అవకాశం ఉన్న విద్యార్థులకు మాత్రమే అనుకూలంగా ఉందని డీఎంకే పార్టీ ఆరోపిస్తోంది. నీట్ పరీక్ష కారణంగా తమిళనాడు వ్యాప్తంగా 22 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో నిరసనలు వెల్లువెత్తాయి. గతంలో డీఎంకే పార్టీ నీట్ పరీక్షను నిషేధించాలని డిమాండ్ చేస్తూ ఒక రోజు నిరాహార దీక్ష చేసింది.

Read Also: Israeli–Palestinian conflict: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. ఇరాన్ ఎంటరైతే..!

పరీక్షకు వ్యతిరేకంగా డీఎంకే ఈ సిగ్నేచర్ క్యాంపెన్ ప్రారంభించింది. ఈ సంతకాల పత్రాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపనున్నారు. రాష్ట్ర మంత్రి, సీఎం స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నీట్ నుంచి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ(ఎన్ఈపీ) వరకు ఫాసిస్టులు మా విద్యాహక్కును హరించడానికి ప్రయత్నిస్తున్నారు, మేము వారిపై నిరంతరం పోరాడుతాము, నీట్ నిషేధించాలన్న మా డిమాండును వ్యతిరేకిస్తే జల్లికట్టు తరహాలో పెద్ద ఎత్తున నిరసన చేపడుతామని కేంద్ర ప్రభుత్వానికి ఉదయనిధి హెచ్చరికలు చేశారు. అన్నాడీఎంకే పార్టీ, మాజీ ముఖ్యమంత్రి పళని స్వామి కూడా ఈ ఉద్యంలో పాల్గొనాలని ఆయన కోరారు. తమిళనాడు హక్కుల్ని కాపాడుకునేందుకు బీజేపీ కూటమి నుంచి బయటకు వచ్చామని చెబుతున్న ఏఐడీఎంకే పార్టీ కూడా ఈ ప్రచారంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.