DK Shivakumar: కర్ణాటకలో తుంగభద్ర డ్యామ్ క్రస్ట్ గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణ భారతదేశంలో తాను, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి చరిత్ర సృష్టించామని పేర్కొన్నారు. మూడు రాష్ట్రాల మధ్య సమన్వయం పెంపొందిస్తూ రైతుల ప్రయోజనాల కోసం కలిసి పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రైతుల సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని, నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించి రైతులను కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.
భవిష్యత్తులో కృష్ణా, గోదావరి, కావేరి నదుల అనుసంధానం అవసరమని డీకే శివకుమార్ అభిప్రాయపడ్డారు. దేశంలోని నీటి వనరులను సమగ్రంగా వినియోగించుకోవాలంటే నదుల అనుసంధానం కీలకమని పేర్కొన్నారు. ఈ దిశగా రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం కలిసి ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. నీటి పంపకాల విషయంలో రాష్ట్రాల మధ్య ఎలాంటి విభేదాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సాగునీటి శాఖ అధికారులు, కేంద్ర జలశక్తి శాఖ అధికారులతో సమన్వయం కొనసాగిస్తూ సమస్యలకు పరిష్కారం కనుగొంటామని చెప్పారు. తుంగభద్ర డ్యామ్ క్రస్ట్ గేట్ల పునర్నిర్మాణం రాష్ట్రాల మధ్య సహకారానికి నిదర్శనమని పేర్కొన్న డీకే శివకుమార్, భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతామని అన్నారు. అనంతరం “జై కర్ణాటక, జై ఆంధ్ర, జై తెలంగాణ” అంటూ నినాదాలు చేస్తూ తన ప్రసంగాన్ని ముగించారు.
కాగా, కర్ణాటక వేదికగా ఆసక్తికర దృశ్యం ఆవిష్కృతం అయ్యింది.. ముగ్గురు ముఖ్యమంత్రులు (చంద్రబాబు, డీకే శివకుమార్, రేవంత్ రెడ్డి) ఒకే వేదికపై చేతులు కలిపారు. తుంగభద్ర డ్యామ్ కొత్త గేట్ల ప్రారంభోత్సవంలో భాగంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. డీకే శివకుమార్, రేవంత్ రెడ్డి, చంద్రబాబు సహా కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ క్రమంలోనే మాట్లాడిన డీకే శివకుమార్.. తాను, చంద్రబాబు, రేవంత్ రెడ్డి ముగ్గురం కలిపి చరిత్ర సృష్టిస్తామని పేర్కొన్నారు..

