కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ హస్తిన పర్యటనలో ఉన్నారు. పర్యటనలో భాగంగా కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్గాంధీని కలిశారు. పార్లమెంట్ సమావేశాల్లో అగ్ర నేతలంతా బిజీగా ఉన్నారు. ఈ సమయంలో డీకే.శివకుమార్కు అపాయింట్మెంట్ దొరకడం రాజకీయంగా సర్వత్రా ఆసక్తి రేపుతోంది. రాష్ట్ర సమస్యలపై చర్చించడానికే అని చెబుతున్నా.. పొలిటికల్గా ఏదో ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
కొంత కాలంగాలో కర్ణాటకలో సీఎం కుర్చీపై పంచాయితీ నడుస్తోంది. హస్తిన వేదికగా చాలా రోజులు ముఖ్యమంత్రి మార్పుపై పంచాయితీ నడిచింది. అనంతరం బెంగళూరుకు షిప్ట్ అయింది. ఒకసారి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బ్రేక్ ఫాస్ట్ ఇవ్వగా.. ఇంకొకసారి శివకుమార్ బ్రేక్ ఫాస్ట్ ఇచ్చారు. ఇలా కొద్దిరోజులు బ్రేక్ ఫాస్ట్ రాజకీయాలు నడిచాయి. కానీ ముఖ్యమంత్రి మార్పు జరగలేదు. ప్రస్తుతం స్తబ్దతగా ఉన్న రాజకీయాలు మరోసారి ఢిల్లీ వేదికగా హీటెక్కుతోంది.
ఇటీవల కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలన పూర్తి చేసుకుంది. దీంతో డీకే.శివకుమార్ మద్దతుదారులు ముఖ్యమంత్రి పదవి అప్పగించాలని డిమాండ్ చేశారు. దీంతో రెండు వర్గాల మధ్య సీఎం కుర్చీపై పంచాయితీ నడిచింది. కానీ అధిష్టానం ఏమీ తేల్చలేదు. ఈసారైనా తేల్చుతుందో లేదో చూడాలి.
