NTV Telugu Site icon

Tamil Nadu Governor: ‘‘సెక్యులరిజం’’తో భారత్‌కి ఏం సంబంధం.. గవర్నర్ వ్యాఖ్యలపై దుమారం..

Tamil Nadu Governor

Tamil Nadu Governor

Tamil Nadu Governor: తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి మరోసారి వార్తల్లో నిలిచారు. ఇప్పటికే అక్కడి స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వానికి గవర్నర్‌కి మధ్య విభేదాలు ఉన్నాయి. అయితే, తాజాగా ఆయన చేసిన ‘‘లౌకికవాదం(సెక్యులరిజం)’’ వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి కారణమైంది. ‘‘సెక్యులరిజం అనేది యూరప్ భావన, భారతదేశంలో దానికి స్థానం లేదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘ఈ దేశ ప్రజలపై చాలా మోసాలు జరిగాయి. వాటిలో ఒకటి లౌకికవాదం. దీనికి తప్పుడు వివరణ ఇవ్వడానికి ప్రయత్నించారు. సెక్యులరిజం అంటే ఏమిటి..? సెక్యులరిజం అనేది యూరోపియన్ భావిన. ఇది భారతీయ భావన కాదు.’’ అని కన్యాకుమారిలో జరిగిన ఓ బహిరంగ కార్యక్రమంలో రవి అన్నారు.

Read Also: Badlapur encounter: బద్లాపూర్ రేప్ నిందితుడి ఎన్‌కౌంటర్.. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‌గా మారిన అంశం..

చర్చి, రాజు మధ్య పోరాటం ఫలితంగా లౌకికవాదం వచ్చిందని, భారతదేశం ధర్మానికి ఎలా దూరంగా ఉంటుంది..? అని, సెక్యులరిజం అనే యూరోపియన్ భావనని అక్కడే ఉండనివ్వడం, భారతదేశానికి సెక్యలరిజం అవసరం లేదని తమిళనాడు గవర్నర్ అన్నారు. 1976లో 42వ సవరణ ద్వారా భారత రాజ్యాంగ ప్రవేశికలో “సెక్యులర్” అనే పదాన్ని చేర్చారు.

అయితే, గవర్నర్ వ్యాఖ్యల్ని రాజకీయ పార్టీలు తప్పుపట్టాయి. రాజ్యాంగం కూడా విదేశీ భావన అని ఆయన భవిష్యత్తులో చెప్పవచ్చని ప్రతిపక్షాలు విమర్శించాయి. సీపీఎం నేత బృందా కారత్ మాట్లాడుతూ.. లౌకికవాదం లేదా రాజకీయాల నుంచి మతాన్ని వేరు చేయడం భారత రాజ్యాంగంలో కీలకమని అన్నారు. ఇది ఆర్ఎస్ఎస్ భావన అని, అలాంటి గవర్నర్‌ని నియమించడం సిగ్గు చేటని ఆమె అన్నారు. సిపిఐ నాయకుడు డి రాజా గవర్నర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు మరియు భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ కూడా “ధర్మపరిపాలన భావనను” తిరస్కరించారని అన్నారు. ఫెడరలిజం, ఒక వ్యక్తి ఒకే ఓటు, ప్రజాస్వామ్య అనేవి కూడా యూరప్ నుంచే ఉద్భవించాయనే లాజిక్‌ని గవర్నర్ మరిచారా..? అని కాంగ్రెస్ నేత పి. చిదంబరం ప్రశ్నించారు. సెక్యులరిజం అనేది భారతదేశానికి అత్యంత అవసరమైన భావన, ఐరోపాది కాదని, రాజ్యాంగాన్ని పూర్తిగా చదవాలని డీఎంకే అధికార ప్రతినిధి టీకేఎస్ ఇలంగోవన్ అన్నారు.