Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్లో దర్యాప్తు ఏజెన్సీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దూకుడు పెంచింది. హైదరాబాద్ కేంద్రంగా లిక్కర్ స్కామ్ డొంక కదులుతోంది. ఈ స్కామ్ లో ముడపుల విషయంలో ఈడీ లోతుగా దర్యాప్తు చేస్తోంది. లిక్కర్ స్కాం కేసులో ఉన్న కంపెనీలకు హైదరాబాద్ కంపెనీల నుండి భారీగా ముడుపులు వెళ్లినట్లు ఆధారాలు ఉన్నాయి. శ్రీనివాసరావుకు చెందిన పలు కంపెనీల నుంచే ముడుపులు వెళ్లినట్లు ఆధారాలను ఈడీ గుర్తించినట్లు సమాచారం. ఈ లిక్కర్ స్కామ్ కేసులో శ్రీనివాసరావు పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. సీఏ బుచ్చిబాబు ఇంట్లో సోదాల అనంతరమే శ్రీనివాస్ రావుపై ఈడీ ఫోకస్ పెట్టింది. దోమలగూడలోని బుచ్చిబాబు ఇంటిలో ఈడీ సుదీర్ఘంగా సోదాలు చేసింది. అతని ఇంట్లో దొరికిన హార్డ్ డిస్క్ లో కీలక సమాచారం లభించినట్లు సమాచారం. కోట్ల రూపాయల లావాదేవీలు శ్రీనివాస రావు ద్వారానే జరిగినట్లు ఆధారాలు దొరికాయి.
పలు కంపెనీల ఏర్పాటుకు సంబంధించిన డాక్యుమెంట్లను ఈడీ స్వాధీనం చేసుకుంది. పలు ఒప్పంద పత్రాలను ఈడీ పరిశీలిస్తుంది. పిళ్ళై, శ్రీనివాసరావు మధ్య జరిగిన సంభాషణలను ఈడీ రిట్రైవ్ చేసింది. సిగ్నల్ యాప్ ద్వారా ఇద్దరి మధ్య సంభాషనలు కొనసాగాయి. వీరిద్దరి నుంచి ఈడీ కీలక సమాచారాన్ని సేకరించింది. మొత్తం లావాదేవీలు శ్రీనివాసరావు ద్వారానే జరిగినట్లు ఈడీ వద్ద ఆధారాలు ఉన్నాయి. లిక్కర్ టెండర్ల కోసం ఈ డబ్బును చెల్లించారా..? లేకపోతే మరేదానికైనా చెల్లించారా.? అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది.
Read Also: UK: హిందూ దేవాలయంపై దాడి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరిన భారత్
లిక్కర్ స్కీమ్ కోసం వేయాల్సిన టెండర్ల లైసెన్సు కోసం రెండువేల కోట్ల రూపాయలు హైదరాబాద్ నుంచి వెళ్లినట్లు ఈడీ గుర్తించింది. 18 జోన్లకు సంబంధించి తొమ్మిది లిక్కర్ కంపెనీలకు హైదరాబాద్ వ్యాపారవేత్తలతో లింకులను గుర్తించారు. ఈ డబ్బు ఎవరి ఖాతా నుంచి వెళ్లిందనే అంశంపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. సాలిగ్రామ్ ఐటీ కంపెనీ, పవిత్రపై ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్ షాపింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, వరుణ్ సన్ షోరూమ్,గోల్డ్ స్టార్ మైన్స్ అండ్ మినరల్స్ సంస్థలను శ్రీనివాస్ రావు నిర్వహిస్తున్నారు. సాలిగ్రామ్ ఐటీ కంపెనీ రామాంతపూర్ లో ప్రారంభించారు.. అయితే ఈ ఐటీ కంపెనీ అడ్రస్ మాత్రం ఏపీలోని కడప రిజిస్ట్రేషన్ ఇచ్చాడు శ్రీనివాస రావు. ఢిల్లీ లిక్కర్ కేసులో నిందితులుగా ఉన్న పిళ్లై, అభిషేక్ రావ్, గండ్ర ప్రేమ్ సాగర్, సృజన్ రెడ్డిలకు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసిన శ్రీనివాస్ రావ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.