EV Push: దేశ రాజధానిలో శీతాకాలంలో ఉక్కిరిబిక్కిరి చేసే వాయు కాలుష్యానికి చెక్ పెట్టేందుకు ఢిల్లీ ప్రభుత్వం అత్యంత కీలకమైన అడుగు వేసింది. వాహనదారులను ఎలక్ట్రిక్ వాహనాల (EVs) వైపు మళ్లించేందుకు సరికొత్త ‘ఎలక్ట్రిక్ వెహికల్ (EV) పాలసీ’కి సోమవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది. ఈ సరికొత్త పాలసీ ప్రకారం.. రూ.30 లక్షల లోపు ధర ఉన్న ఎలక్ట్రిక్ కార్లకు రోడ్ టాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజుల నుంచి పూర్తిగా మినహాయింపు ఇవ్వనున్నారు. సీఎం రేఖా గుప్తా నేతృత్వంలోని కేబినెట్ ఆమోదించిన ఈ పాలసీని తుది ఆమోదం కోసం లెఫ్టినెంట్ గవర్నర్ తరంజిత్ సింగ్ సంధూ వద్దకు పంపనున్నారు. ఎల్జీ క్లియరెన్స్ వచ్చిన తర్వాత జూలై 1 నుంచి ఈ నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఈ పాలసీ మార్చి 31, 2030 వరకు అమల్లో ఉంటుందని సీఎం ప్రకటించారు.
ఏ వాహనానికి ఎంత సబ్సిడీ అంటే..
కేవలం పన్ను మినహాయింపులే కాకుండా వివిధ కేటగిరీల ఈవీ వాహన కొనుగోలుదారులకు ప్రభుత్వం భారీ నగదు సబ్సిడీలను ప్రకటించింది. హైబ్రిడ్ వాహనాలకు ఎలాంటి సబ్సిడీలు ఉండవని, కేవలం జీరో-ఎమిషన్ (పూర్తి ఈవీ) వాహనాలకు మాత్రమే ఇవి వర్తిస్తాయని స్పష్టం చేసింది.
ఎలక్ట్రిక్ టూ-వీలర్స్ (బైక్స్/స్కూటర్స్): కొనుగోలుదారులకు మొదటి ఏడాది రూ.30,000, రెండో ఏడాది రూ.20,000, మూడో ఏడాది రూ.10,000 చొప్పున సబ్సిడీ లభిస్తుంది.
ఎలక్ట్రిక్ త్రీ-వీలర్స్ (ఆటోలు): వీరికి వరుసగా మొదటి మూడేళ్లలో రూ.50,000, రూ.40,000, రూ.30,000 చొప్పున ప్రోత్సాహకాలు అందుతాయి.
ఈ-ట్రక్కులు (N1 కేటగిరీ): లైట్ కమర్షియల్ ఈవీ ట్రక్కుల కొనుగోలుపై గరిష్ఠంగా రూ.1 లక్ష వరకు సబ్సిడీ ఇస్తారు.
స్క్రాపింగ్ బోనస్: పాత BS-IV లేదా అంతకంటే పాత ఫోర్-వీలర్లను స్క్రాప్ చేసి, కొత్త ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేసే వారికి రూ.1 లక్ష స్క్రాపింగ్ ఇన్సెంటివ్ లభిస్తుంది.
పెట్రోల్, సీఎన్జీ బండ్లకు చెక్.. డెడ్లైన్స్ ఇవే
కాలుష్యాన్ని పూర్తిగా అదుపు చేయడానికి వీలుగా పెట్రోల్, సీఎన్జీ వాహనాల రిజిస్ట్రేషన్లను దశలవారీగా నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జనవరి 1, 2027 నుంచి ఢిల్లీలో కేవలం ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలను మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తారు. పెట్రోల్/సీఎన్జీ ఆటోలు బంద్ కానున్నాయి. ఏప్రిల్ 1, 2028 నుంచి కొత్త పెట్రోల్, సీఎన్జీ టూ-వీలర్ల (బైక్స్/స్కూటర్స్) రిజిస్ట్రేషన్లను పూర్తిగా నిలిపివేస్తారు. ఆ తర్వాత కేవలం ఎలక్ట్రిక్ టూ-వీలర్లకే రిజిస్ట్రేషన్ అనుమతి ఉంటుంది. ఈ సందర్భంగా సీఎం రేఖా గుప్తా మాట్లాడుతూ.. “ఇది ఢిల్లీ చరిత్రలోనే ఒక మైలురాయి. రాబోయే నాలుగేళ్లలో ఈ పాలసీ ద్వారా దాదాపు రూ.15,000 కోట్ల విలువైన ప్రయోజనాలు, పెట్టుబడులు వస్తాయని ఆశిస్తున్నాం. ఇందులో రూ.7,000 కోట్లు నేరుగా ఇన్సెంటివ్స్ (సబ్సిడీల) కోసం, మరో రూ.8,000 కోట్లు ఈవీ మౌలిక సదుపాయాల కల్పనకు, పన్ను రాయితీలకు కేటాయించాం” అని వెల్లడించారు. ఈ విస్తరణకు మద్దతుగా ఢిల్లీ అంతటా 32,000 ఈవీ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందుకోసం ఇప్పటికే భూమిని కూడా సేకరించామని చెప్పారు. లబ్ధిదారులు సబ్సిడీల కోసం దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా ఒక ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్ను కూడా త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రభుత్వం చెప్పింది.

