యూపీ అసెంబ్లీ ఎన్నికలు వేడిని రాజేస్తున్నాయి. విజయం కోసం పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ పోటీపై విషయంలో కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. అఖిలేష్ పోటీ చేస్తున్న కర్హాల్ నియోజకవర్గంలో తమ అభ్యర్థిని బరిలో దింపరాదని కాంగ్రెస్ నిర్ణయించింది. దీనిపై బీజేపీ మండిపడుతోంది.
ఉత్తరప్రదేశ్ లోని మెయిన్ పురి జిల్లా కర్హాల్ నియోజకవర్గం హాట్ టాపిక్ అవుతోంది. అధికార బీజేపీకి గట్టి సవాల్ విసురుతున్న సమాజ్ వాదీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఇక్కడి నుంచే పోటీ చేస్తుండడంతో ఆయన్ని ఓడించేందుకు బీజేపీ వ్యూహాలు పన్నుతున్న వేళ కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశం అవుతోంది. అఖిలేష్ పై కేంద్రమంత్రి సత్యపాల్ సింగ్ బఘేల్ ను బీజేపీ బరిలో నిలిపింది. దీనికి ధీటుగా సమాజ్ వాదీ పార్టీ ముందుకెళుతోంది.
ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. అఖిలేష్ నియోజకవర్గంలో ఇంతకుముందే జ్ఞానవతి దేవికి ఇచ్చిన టికెట్ ను చివరి నిమిషంలో రద్దు చేసింది. నామినేషన్ పత్రాలు నింపవద్దంటూ ఢిల్లీలోని కాంగ్రెస్ హైకమాండ్ నుంచి హడావిడిగా ఆదేశాలు వచ్చాయి. ఈ మేరకు మెయిన్ పురి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోపాల్ కులశ్రేష్ఠ జ్ఞానవతికి సమాచారం పంపారు. ఇవాళ నామినేషన్లకు తుదిగడువు కాగా, కాంగ్రెస్ నిర్ణయంతో ఇక్కడ ప్రధానంగా ద్విముఖ పోరు నెలకొంది.
1993 నుంచి కర్హాల్ నియోజకవర్గం సమాజ్ వాదీ పార్టీకి కంచుకోట. 2002లో మాత్రం ఇక్కడ బీజేపీ అభ్యర్థి గెలిచారు. తమకు బాగా పట్టున్న కర్హాల్ నియోజకవర్గాన్ని ఆయన ఎంచుకున్నారు. అఖిలేశ్ గతంలో నాలుగు పర్యాయాలు లోక్ సభ సభ్యుడిగా గెలిచారు. అఖిలేశ్ పై పోటీ చేస్తున్న సత్యపాల్ సింగ్ బఘేల్ ది కూడా ఆసక్తికరమైన చరిత్రే. ఆయన గతంలో ఉత్తరప్రదేశ్ లో పోలీస్ సబ్ ఇన్ స్పెక్టర్ గా పనిచేశారు. అప్పట్లో ములాయం సింగ్ యాదవ్ యూపీ సీఎంగా వున్నప్పుడు ఆయనకు భద్రతాధికారిగా వ్యవహరించారు. బఘేల్ ను రాజకీయాల్లోకి తీసుకువచ్చింది ములాయం సింగ్ కాగా ఆయన తదనంతరం బీజేపీలో చేరారు.
బఘేల్… అఖిలేశ్ పై పోటీ చేయడం ఇది రెండోసారి. 2009లో ఫిరోజాబాద్ లోక్ సభ స్థానం నుంచి అఖిలేశ్ పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం బఘేల్ ఆగ్రా ఎంపీగా ఉన్నారు. ఇద్దరి పోటీతో రాజకీయం రసవత్తరంగా మారింది.