నేడు జరిగిన అసెంబ్లీ సమావేశంలో తమిళనాడు సీఎం స్టాలిన్ కీలక తీర్మానం ప్రవేశ పెట్టారు. గతంలో అమోదం పొందిన సుమారు 10 బిల్లులను పాస్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని గవర్నర్ ఆర్ఎన్ రవి చర్యలు తీసుకోవాలి కోరారు. 2020, 2023లో రెండు బిల్లులకు ఆమోదం దక్కిందని, మరో ఆరు బిల్లులు గత ఏడాది పాస్ చేశామని, కానీ ఇంత వరకు గవర్నర్ ఆ బిల్లులకు ఓకే చెప్పలేదని స్టాలిన్ పేర్కొన్నారు. ఎటువంటి కారణాలు లేకుండానే గవర్నర్ రవి అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లులను తిప్పి పంపినట్లు సమావేశంలో స్టాలిన్ ఆరోపించారు.
రాజ్యాంగంలోని 200వ ఆర్టికల్ ప్రకారం ఆ బిల్లులను మళ్లీ పాస్ చేశామని, తమిళనాడు అసెంబ్లీ రూల్ 143 ప్రకారం కూడా బిల్లులకు ఆమోదం దక్కిందని స్టాలిన్ తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలను గవర్నర్ రవి అడ్డుకుంటున్నారన్నారు. వ్యక్తిగత కారణాలతో గవర్నర్ తమ బిల్లులను వెనక్కి పంపారని, ఇది అప్రజాస్వామికమని సీఎం అన్నారు. అలాగే నాన్ బీజేపీ రాష్ట్రాలను కేంద్రం కావాలనే టార్గెట్ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఒకవేళ ఏవైనా అనుమానాలు ఉంటే నివృత్తిక చేసుకోవాలని, కానీ ఆ బిల్లులకు ఆమోదం ఇవ్వకపోవడం శోచనీయం అన్నారు. అసెంబ్లీని, రాష్ట్ర ప్రజలను గవర్నర్ రవి అవమానిస్తున్నారని వ్యాఖ్యానించారు.