CJP: బొద్దింకల్ని తరిమికొట్టిన ప్రజలు.. పాకిస్తానీలు, నక్సల్స్ అంటూ నినాదాలు..

  • జైపూర్‌లో ప్రభుత్వ పాఠశాల తనిఖీకి వెళ్లిన CJP బృందంపై గ్రామస్తుల దాడి.
  • CJP కార్యకర్తలను అడ్డుకుని, దూషించి, వెంబడించినట్లు వైరల్ వీడియోలు.
  • బృందంపై దాడి వెనుక బీజేపీ నేతల హస్తం ఉందని CJP ఆరోపణ.

CJP: రాజస్థాన్ జైపూర్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాల తనిఖీకి వెళ్లిన కాక్రోచ్ జనగా పార్టీ(CJP) వ్యక్తుల్ని గ్రామస్తులు తరిమికొట్టారు. ఈ ఘటనపై సీజేపీ నేతలు మాట్లాడుతూ.. బీజేపీ గుండాలే దాడి చేశారని ఆరోపించారు. అయితే బీజేపీ మాత్రం గ్రామస్తులే సీజేపీ టీమ్‌ను వ్యతిరేకించారని అంటోంది. మరోవైపు, గ్రామస్తులు తమకు బీజేపీ, కాంగ్రెస్ ఏ పార్టీతో సంబంధం లేదని చెప్పారు.

జైపూర్‌లోని బాగ్రూ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని రాంపురా-కన్వార్‌పురా గ్రామంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. CJP సహ వ్యవస్థాపకుడు ఆశుతోష్ రాంకా నేతృత్వంలోని బృందం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను పరిశీలించేందుకు గ్రామానికి వెళ్లింది. వైరల్ అవుతున్న వీడియోల్లో సీజేపీ కార్యకర్తల్ని గ్రామంలోని ప్రజలు దూషిస్తూ, వారిపై దాడి చేస్తున్న దృశ్యాలు కనిపించాయి. కొందరు వ్యక్తులు వారిని ‘‘ అర్బన్ నక్సల్స్’’, ‘‘దేశ వ్యతిరేకులు’’, ‘‘పాకిస్తానీలు’’ అంటూ నినాదాలు చేశారు. దాడి తర్వాత సీజేపీ బృందం పాఠశాలను సందర్శించకుండా వెళ్లిపోయింది.

ఈ దాడిపై అశుతోష్ రాంకా మాట్లాడుతూ.. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల కొన్నేళ్లుగా పశువుల కొట్టంలోనే నడుస్తోందని ఆరోపించారు. గత ఏడాది కూడా తాము ఆ స్కూల్‌ను పరిశీలించామని, ఈసారి వెళ్లే విషయాన్ని ముందుగా పోలీసులకు చెప్పామని అన్నారు. అయితే, తమ కార్యకర్తలపై దాడి జరిగిందని, కార్లను ధ్వంసం చేశారని, ఫోన్లు పగలగొట్టారని ఆరోపించారు. ఒక మహిళపై దాడి జరిగిందని, తమ టీమ్‌లో ఓ వ్యక్తి చేతికి ఫ్రాక్చర్ అయిందని తెలిపారు.

ఈ దాడి వెనక బీజేపీకి చెందిన నాయకులు ఉన్నారని అశుతోష్ రాంకా ఆరోపించారు. గ్రామస్తులు దాడి చేయలేదని, బయట నుంచి కొంతమందిని తీసుకువచ్చి హింసను ప్రేరేపించారని, స్థానిక బీజేపీ కౌన్సిలర్ కొందరు వ్యక్తులకు డబ్బులు పంచుతున్నట్లు తమకు సమాచారం ఉందని ఆయన సోషల్ మీడియాలో ఆరోపించారు. అయితే, బీజేపీ ఈ ఆరోపణల్ని ఖండించింది. గ్రామస్తులే సీజేపీ రాకను వ్యతిరేకించారని ఎమ్మెల్యే స్వామి బాలముకుందాచార్య అన్నారు. పిల్లల విద్యకు అంతరాయం కలిగించే వాతావరణాన్ని సృష్టించేందుకు సీజేపీ ప్రయత్నిస్తోందని చెప్పారు.