Delimitation: నియోజకవర్గా పునర్విభజనపై కేంద్రం కసరత్తు మొదలుపెట్టింది. డీలిమిటేషన్ కోసం రాజకీయ ఏకాభిప్రాయాన్ని కూడగట్టేందుకు చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. 2029 లోక్సభ ఎన్నికలకు ముందే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని బీజేపీ సర్కార్ భావిస్తోంది. దీని కోసం ఒక కొత్త బిల్లును తీసుకువచ్చే అవకాశాలను ప్రభుత్వం అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. బిల్లు ఆమోదం పొందితే దశాబ్ధాల తర్వాత పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజనకు మార్గం సుగమం అవుతుంది. భారత రాజకీయ మ్యాప్ మారుతుంది.
మారనున్న పొలిటికల్ మ్యాప్:
పలు పార్టీల మద్దతు కూడగట్టేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, ఇతర ప్రాంతీయ పార్టీలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం లోక్సభ స్థానాల కేటాయింపు 1971 జనాభా లెక్కల ఆధారంగా ఉంది. ప్రస్తుతం లోక్సభలో 543 మంది ఎంపీలు ఉన్నారు. డీలిమిటేషన్ అమలులోకి వస్తే రాష్ట్రాలలోని ఎంపీ సీట్ల సంఖ్యలో గణనీయమైన మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.
అయితే, డీలిమిటేషన్పై దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జనాభా నియంత్రించిన రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా, ఒక ఫార్ములా రూపొందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. డీలిమిటేషన్ అంశాన్ని రాజకీయ వివాదంగా మార్చకుండా, ఏకాభిప్రాయంతో ముందుకు వెళ్లాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రాంతీయ పార్టీలతో తొలి దశ చర్చల్లో సానుకూల ఫలితాలు వచ్చినట్లు సమాచారం. అన్ని పార్టీలతో సంప్రదింపులు పూర్తయ్యాక డీలిమిటేషన్ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
