పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల వేదికగా అధికార-ప్రతిపక్ష ఎంపీల మధ్య సంఘర్షణ కొనసాగుతోంది. ఇక పార్లమెంట్లో ప్రతిపక్ష ఎంపీలకు సంబంధించిన వీడియోలను కేంద్రమంత్రి కిరణ్ రిజిజు వరుసగా విడుదల చేస్తున్నారు. ఇప్పటికే రెండు వీడియోలు విడుదల చేయగా… తాజాగా స్పీకర్ ఛాంబర్లో ఓం బిర్లాను విపక్ష ఎంపీలు బెదిరిస్తున్నట్లు ఉన్న వీడియోను విడుదల చేశారు.
20-25 మంది కాంగ్రెస్ ఎంపీలు స్పీకర్ ఓం బిర్లా చాంబర్లోకి చొరబడి.. ఆయనను, ప్రధానమంత్రిని దుర్భాషలాడి బెదిరించారని కేంద్రమంత్రి ఆరోపించారు. చట్టవిరుద్ధంగా రికార్డ్ చేసిన వీడియోను షేర్ చేశారని కిరణ్ రిజిజు ఆరోపించారు.
‘‘గౌరవనీయులైన స్పీకర్ చాంబర్లోకి 20-25 మంది కాంగ్రెస్ ఎంపీలు ప్రవేశించి ఆయనను దుర్భాషలాడి. గౌరవనీయులైన ప్రధానమంత్రిని బెదిరించినప్పుడు ఒక కాంగ్రెస్ ఎంపీ తీసిన చట్టవిరుద్ధమైన వీడియో క్లిప్ ఇది. మా పార్టీ చర్చలను నమ్ముతుంది. ఎంపీలు భౌతికంగా బెదిరించడాన్ని ఎప్పుడూ ప్రోత్సహించదు.’’’ రిజిజు ఎక్స్లో రాశారు.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాజీ ఆర్మీ చీఫ్ నరవణే రాసిన పుస్తకాన్ని ప్రస్తావించారు. దీన్ని స్పీకర్ ఓం బిర్లా, కేంద్రమంత్రులు అడ్డుకున్నారు. ఇక ఫిబ్రవరి 4న ప్రధాని మోడీపై కాంగ్రెస్ ఎంపీలు భౌతిక దాడికి సిద్ధపడుతున్నారని స్పీకర్ ఓం బిర్లా అన్నారు. దీంతో స్పీకర్ పక్షపాతం వ్యవహరిస్తున్నారని.. తొలగించాలని కాంగ్రెస్ నోటీసు ఇచ్చింది. ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు గందరగోళంగా నడుస్తున్నాయి.
