భోపాల్ ఎంపీ సాధ్వీ ప్రగ్యా ఠాకూర్ తరచూ వివాదాల్లో చిక్కుకుంటారు.. తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్.. ఆమె ఆరోగ్యంపై కాంగ్రెస్ పార్టీ సెటైర్లు గుప్పిస్తోంది. అనారోగ్యం కారణంగా మాలెగావ్ పేలుళ్ల విచారణకు హాజరుకాలేనని చెబుతున్న ఆమె.. పెళ్లి వేడుకలో డ్యాన్సులు చేయడంపై మండిపడుతున్నారు. అయితే, ఎంపీ ప్రగ్యా ఠాకూర్.. ఇద్దరు పేదింటి యువతులకు తన ఇంట్లోనే వివాహం జరిపించారు. ఈ సందర్భంగా వారితో కలిసి ఎంపీ కూడా డ్యాన్స్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. దీంతో కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. కొద్ది రోజుల కింద వీల్చైర్ మీద కనిపించిన ఎంపీ.. ఇలా డ్యాన్స్ చేసినప్పుడు ఎంతో సంతోషంగా అనిపిస్తుందని కాంగ్రెస్ పార్టీ నేత సలూజ విమర్శించారు. కోర్టు ముందు హాజరుకాకుండా ఉండేందుకు అనారోగ్యంగా ఉన్నట్లు నటిస్తారని.. కానీ ఇలాంటి వేడుకల్లో మాత్రం సంతోషంగా ఉంటారని సెటైర్ వేశారు. కొద్దిరోజుల క్రితం ప్రగ్యా ఠాకూర్.. బాస్కెట్బాల్ ఆడుతున్న వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. పేదరికంతో కూతుళ్లకు పెళ్లి చేయలేని స్థితిలో ఉన్న కార్మికుడు నర్మద మిశ్రాకు అండగా నిలిచారు ఎంపీ ప్రగ్యా. అతని ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్లను ఆమే చేశారు. అంతేకాదు.. ఆ ఇద్దరు అమ్మాయిలకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటానని చెప్పారు.