Bird flu in Kerala, Order to kill chickens and ducks: కేరళలో బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. కేరళలోని రెండు పంచాయతీల్లో బర్డ్ ఫ్లూను గుర్తించారు అధికారులు. దీంతో దీన్ని అడ్డుకునేందుకు చర్యలు చేపట్టారు. కొట్టాయంలోని అర్పూకర, తలయజమ్ అనే రెండు పంచాయతీల్లో బర్డ్ ఫ్లూ వ్యాపించింది. ప్రభావిత ప్రాంతాల నుంచి కిలోమీటర్ పరిధిలో ఉన్న 8000 కోళ్లు, బాతులను, ఇతర పెంపుడు పక్షులను చంపాలని అధికారులను ఆదేశించింది ప్రభుత్వం. జిల్లా కలెక్టర్ పీకే జయశ్రీ అధ్యక్షతన జరిగిన అత్యవసర సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య చర్యలు, క్రిమిసంహారక మందులను చల్లాలని స్థానిక సంస్థలు, జంతు సంక్షేమ శాకలను ఆదేశించింది.
Read Also: S Jaishankar: ఒసామా బిన్ లాడెన్కు ఆశ్రయం ఇచ్చిన మీరా మాట్లాడేది..? పాక్ తీరుపై నిప్పులు
బర్డ్ ఫ్లూ వెలుగులోకి వచ్చిన ప్రాంతం నుంచి 10 కిలోమీటర్ల పరిధిలోని అన్ని ప్రాంతాల్లో మూడు రోజుల పాటు కోడి, బాతు, కోడిగుడ్లు, మాంసం అమ్మకాలు, దిగుమతులు, ఎగుమతులపై నిషేధం విధించారు. 10 కిలోమీటర్ల పరిధిలోని 19 గ్రామపంచాయతీల్లో కోడి, బాతులు, ఇతర పెంపుడు పక్షల అసాధారణ మరణాలు సంభవిస్తే వెంటనే సమాచారం అందించాలని జిల్లా కలెక్టర్ ప్రజలకు సూచించారు.
ముఖ్యంగా పక్షులను ప్రభావితం చేసే హెచ్5ఎన్1 వైరస్ బర్డ్ ఫ్లూకు కారణం అవుతుంది. దీన్ని తినడం వల్ల మనుషులకు సోకే ప్రమాదం కూడా ఉంది. ముఖ్యంగా వలస పక్షలు, సముద్ర పక్షుల ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది. అర్పూకరలోని డక్ ఫామ్ లో, తలయాజమ్ లోని కోళ్ల ఫాంలో చనిపోయిన పక్షుల నమూనాలను పరీక్షల కోసం భోపాల్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ ల్యాబ్కు పంపారు. జంతు సంరక్షణ శాఖ, స్థానిక సంస్థలు, రెవెన్యూ, పోలీస్, అటవీ శాఖ, ఆరోగ్య శాఖ సమన్వయంతో రక్షణ చర్యలు చేపట్టాలని కొట్టాయం జిల్లా కలెక్టర్ ఆదేశించారు.