ఇప్పటి వరకు చోరీలు. దోపిడీలు ఖరీదైన వాటి కోసమో.. లేదంటే ఆభరణాల కోసమో, డబ్బు కోసం జరుగుతాయని వార్తల్లో.. టీవీల్లో చూశాం. కానీ ఇప్పుడు దొంగతనాలు కొత్త రూపం దాల్చాయి. తాజాగా దొంగల కన్ను వంటింటిపై పడింది. ఇందుకు టెక్ సిటీ బెంగళూరులో జరిగిన సంఘటనే ఉదాహరణ.
గత మూడు వారాలుగా పశ్చిమాసియాలో యుద్ధం భీకరంగా జరుగుతోంది. దీంతో గ్యాస్, చమురు ఇబ్బందులు తలెత్తాయి. ముఖ్యంగా ప్రపంచ దేశాల్లో గ్యాస్ సంక్షోభం తలెత్తింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వాణిజ్య సిలిండర్ల సరఫరా నిలిపేసింది. దీంతో గృహ వినియోగదారులు భయాందోళనలతో సిలిండర్ల కోసం గ్యాస్ ఏజెన్సీల దగ్గర క్యూ కడుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.
ఈ ఆందోళనల నేపథ్యంలో తాజాగా బెంగళూరులో దొంగల ముఠా ఓ ఇంటిపై పడింది. ఆభరణాలు, నగదు కాకుండా ఏకంగా వంటింటిలో ఉన్న రెండు గ్యాస్ సిలిండర్లను ఎత్తుకెళ్లిపోయారు. చోరీకి చెందిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఉగాది పండుగ రోజే ఈ దొంగతనం జరగడం విశేషం.
సీసీటీవీ వీడియోలో ఇద్దరు వ్యక్తులు స్కూటర్పై బేగూర్ నివాసానికి వస్తున్నట్లు కనిపించింది. హెల్మెట్లు ధరించడంతో ముఖాలు కనిపించలేదు. ఒకరు స్కూటర్పై ఇంట్లోకి ప్రవేశించగా.. మరొకరు బయట రోడ్డుపైనే ఉండిపోయాడు. కొన్ని నిమిషాల తర్వాత నిందితుల్లో ఒకడు స్కూటర్పై రెండు సిలిండర్లతో లోపలి నుంచి బయటకు వచ్చాడు. అనంతరం ఇద్దరూ స్కూటర్పై పరారయ్యారు. బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పటి వరకు నిందితులను అరెస్ట్ చేయలేదు. ఈ ఘటనతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
