Bengaluru: కుళ్లిన మాంసం, గడువు తీరిన పాల ప్యాకెట్లు, బూజు పట్టిన కూరగాయలు.. ఇదేదో రోడ్ సైడ్ చిన్న హోటళ్లలో ఉన్న అపరిశుభ్రత కాదు. దేశ టెక్ రాజధాని బెంగళూర్లో 5-స్టార్ హోటళ్లలో కంపు. కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలతో ఫుడ్ సేఫ్టీ అధికారులు నగరంలోని ప్రముఖ హోటళ్లలో రైడ్స్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో విస్తూపోయే వాతావరణం కనిపించింది.
3 స్టార్, 5 స్టార్ హోటళ్లలో నిర్వహించిన ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో తీవ్ర ఆహార భద్రత ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయి. తాజ్ యశ్వంత్పూర్, శాంగ్రి-లా, రాడిసన్ బ్లూ, ఫోర్ సీజన్స్, ది లలిత్ అశోక్, వివాంతా వంటి ప్రముఖ హోటళ్లలో ఎక్స్పైర్ అయిన పాలు, కుళ్లిన మాంసం, ఫంగస్ పట్టిన కూరగాయలను చూసి కర్ణాటక ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ శాఖ అధికారులు షాక్ అయ్యారు. సంబంధిత హోటళ్లకు నోటీసులు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు.
కర్ణాటక ఆరోగ్య మంత్రి యూటీ ఖాదర్ ఆదేశాల మేరకు 30 ఫుడ్ సేఫ్టీ అధికారుల బృందాలు బెంగళూర్ అర్బన్ జిల్లాలోని 26 హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్-2006 ప్రకారం హోటళ్లు నిబంధనలు పాటిస్తున్నాయా లేదా అనే అంశాన్ని పరిశీలించారు. తనిఖీల్లో చికెన్, మటన్, ఫిష్, వంట నూనె, పాలు, మసాలా దినుసుల వంటి 35 ఫుడ్ శాంపిళ్లను సేకరించి ప్రయోగశాలకు పంపారు. నివేదిక ఆధారంగా ఆయా హోటళ్లపై చర్యలు తీసుకోనున్నారు.

