Nobel Prize: బంగ్లాదేశ్ ప్రభుత్వాధినేత, నోబెల్ అవార్డు గ్రహీత మహ్మద్ యూనస్కి ఇచ్చిన అవార్డుని సమీక్షించాలని కోరుతూ.. బెంగాల్ బీజేపీ ఎంపీ జ్యోతిర్మయ్ సింగ్ మహతో శుక్రవారం నార్వేజియన్ నోబెల్ కమిటీకి లేఖ రాశారు. ఆయన హయాంలో బంగ్లాదేశ్ హిందువుల, ఇతర మైనారిటీలపై జరుగుతున్న తీవ్ర అఘాయిత్యాలు, అకృత్యాలను పరిష్కరించాలని మహతో తన లేఖలో నోబెల్ కమిటీని కోరారు.
Read Also: Bangladesh: హిందువులపై ఆగని దాడులు.. మైనారిటీ హక్కుల సంఘం ఆందోళన..
‘‘ హిందువులు, అన్యాయానికి గురైన వ్యక్తుల గురించి ప్రస్తావిస్తూ భారతమైన హృదయంతో నేను మీకు ఈ లేఖను రాస్తున్నాను. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత డాక్టర్ మహ్మద్ యూనస్ నేతృత్వంలోని ప్రస్తుతం పాలనలో మైనారిటీలు అన్యాయానికి గురవుతున్నారు. మైక్రోఫైనాన్స్పై అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన డా. యూనస్ పాలనలో మానవాళికి వ్యతిరేకంగా క్రూరమైన నేరాలు జరుగుతున్నాయి. అతని పాలనలో హిందూ సమాజం భయానక పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. సామూహిక హత్యలు, టార్గెటెడ్ దాడులు జరుగుతున్నాయి. అత్యాచారాలు, మతపరమైన అణిచివేత, బెదిరింపులు, బలవంతపు వసూళ్లు, దుర్గాపూజ పండగలకు అంతరాయం ఏర్పడింది’’ అని ఆయన లేఖలో పేర్కొన్నారు.
బంగ్లాదేశ్ సామూహిక హత్యల వెనక సూత్రధారి మహ్మద్ యూనస్ అని లేఖలో ఆరోపించారు. నోబెల్ శాంతి బహుమతి శాంతి, న్యాయానికి విరుద్ధంగా ఉన్న వ్యక్తులకు ప్రదానం చేసినప్పుడు, దాని నైతికతను కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. ఒకప్పుడు సంఘ సంస్కర్తగా కీర్తించిబడిని మహ్మద్ యూనస్ ‘‘హిందువుల కసాయి’’గా మారాడని, మైనారిటీలను రక్షించడంలో విఫలమయ్యారని, ఇలాంటి చర్యల్ని ప్రేరేపించే వ్యక్తికి నోబెల్ శాంతి బహుమతిని సమర్థించడం విరుద్ధమని మహతో తన లేఖలో పేర్కొన్నాడు.