Hepatitis-C: కాలేయ వ్యాధికి కారణమవుతున్న హైపటైటిస్-సితో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు, కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తోంది. క్రమంగా హైపటైటిస్-సీ క్రమంగా వ్యాపిస్తోందని.. జాగ్రత్తగా లేకుంటే ఇది తీవ్రమైన వ్యాధిగా విస్తరించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 235 మందిలో ఒకరికి హైపటైటిస్-సీ ఉందని తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో 2022-23లో 1.64 లక్షల మందికి వైద్య పరీక్షలు చేయగా వారిలో 710 మందికి హైపటైటిస్-సీ ఉన్నట్లుగా గుర్తించినట్టు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో వెల్లడించింది. ఇది ఇన్ఫెక్షన్ ఉన్న రక్తం ద్వారా ప్రధానంగా వ్యాపిస్తుంది. సరైన స్క్రీనింగ్ చేయకుండా రక్త మార్పిడి చేయడం ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుందని.. ఇలా చేయడం ప్రమాదమని వైద్యులు చెబుతున్నారు. సురక్షితమైన ఇంజక్షన్ విధానాలు లేకపోవడం, ఇతరులు ఉపయోగించిన వస్తువులు వాడటం ద్వారా కూడా వ్యాపించేందుకు అవకాశం ఉంది.
Read also: Vinayaka Stotram: ఈ స్తోత్ర పారాయణం చేస్తే త్వరలోనే వివాహం జరుగుతుంది
మద్యం అలవాటు, ఊబకాయం ఈ వ్యాధి తీవ్రతను పెంచుతాయి. వ్యాధి తీవ్రమైన తరువాత జ్వరం, అలసట, రుచి కోల్పోవడం, కామెర్ల లక్షణాలు, కీళ్లనొప్పులు, ఆందోళన, ఆకలి మందగించడం, కడుపునొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ప్రారంభ దశలోనే గుర్తించి వైద్యం చేయించుకోకపోతే సమస్య ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. అయితే తొలిదశలో లక్షణాలు అతం త్వరగా బయటపడవని.. కానీ రక్తమార్పిడి వంటి సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవడం, తరచూ రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం వంటివి చేయాలని వైద్య చెబుతున్నారు. లివర్ సిరోసిస్ ద్వారా అత్యధిక మరణాలు మనదేశంలోనే సంభవించినట్లు ఐసీఎంఆర్ నివేదికలో వెల్లడించింది. కాలేయం పూర్తిగా దెబ్బతినడానికి ముందు స్టేజిని లివర్ సిరోసిస్గా చూడాలని వైద్యులు పేర్కొంటున్నారు. 2017వ సంవత్సరంలో సుమారుగా 2,20,000 మంది లివర్ సిరోసిస్, కాలేయ వ్యాధులతో మృతి చెందినట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది. హెపటైటిస్-సీని నిర్లక్ష్యం చేస్తే లివర్ సిరోసిస్తోపాటు కాలేయం జబ్బులు తీవ్ర స్థాయికి వెళ్లే ప్రమాదం ఉందంటున్నారు. 2020 ఏప్రిల్ నుంచి 2023 మార్చి వరకు దేశవ్యాప్తంగా 5.82 కోట్ల మందికి స్క్రీనింగ్ చేయగా 1.74 లక్షల మంది తీవ్రమైన హెపటైటిస్- బి, హెపటైటిస్-సీ వల్ల బాధపడుతున్నట్లు గుర్తించారు. రాష్ట్రంలో ‘బి’ బాధితుల కంటే ‘సీ’ బాధితులే ఎక్కువగా ఉన్నారు. హైపటైటిస్ కోసం వైద్య పరీక్షలు చేయించుకున్నవారిలో ‘బి’ బాధితులు 0.05 శాతం మంది ఉండగా.. ‘సి’ రోగులు 0.4 శాతం మంది ఉన్నట్లు నివేదికలో వెల్లడయింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు హైపటైటిస్-సీతో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.