Israel-Iran War: ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం తీవ్రంగా కొనసాగుతున్న తరుణంలో అయోధ్యలో జరిగిన ఒక కార్యక్రమం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తపస్వి ఛావని పీఠాధిపతి జగద్గురు పరమహంసాచార్య మంగళవారం ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూకు వేద మంత్రోచ్ఛారణతో ఆశీర్వచనాలు అందించారు. ఆయన కోసం ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఆయన ఫోటోకు తిలకం పెట్టి పూజలు నిర్వహించారు. నెతన్యాహూ ‘‘మహాపురుషుడు’’ అంటూ కొనియాడారు.
ఇరాన్లో హిజాబ్ వ్యతిరేక ఆందోళన పేరుతో మహిళలపై, చిన్నపిల్లలపై అమానుష చర్యలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ఇలాంటి సమయంలో ఇజ్రాయిల్ చేపడుతున్న సైనిక చర్యను ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిర్ణయాత్మక పోరాటంగా అభివర్ణించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా నెతన్యాహూకు మద్దతు తెలిపిన విషయాన్ని ప్రస్తావించారు.
పరమహంసాచార్య మాట్లాడుతూ.. అమాయకులను హతమార్చే వారు ఉగ్రవాదులే అని, అలాంటి వారిని పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని అన్నారు. మానవత్వ రక్షణ కోసమే ఇజ్రాయిల్ ఈ యుద్ధం చేస్తోందని ఆయన అన్నారు. భగవాన్ శ్రీరాముడు అధర్మాన్ని నిర్మూలించినట్లే, భారత ప్రధాని నరేంద్రమోడీ కూడా ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి కట్టుబడి ఉన్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వేద మంత్రోచ్ఛారణలతో పాటు అనుష్టానాలు నిర్వహించారు. అంతర్జాతీయ స్థాయిలో ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి అంతా ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.