Pakistan: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ భారత్పై ఎలాంటి వ్యతిరేకతను ప్రదర్శించాడో, జైషే మహ్మద్ ఉగ్రవాది చెప్పడం సంచలనంగా మారింది. ఆపరేషన్ సిందూర్ కు ప్రతిగా పాక్ ప్రారంభించిన దాడుల్ని ‘‘ఘజ్వా-ఎ-హింద్’’గా అభివర్ణించాడని జైష్ ఉగ్రవాది ఇలియాస్ కాశ్మీరీ అన్నాడు. భారతదేశంపై మతపరమైన యుద్ధం చేసి, ఇస్లామిక్ పాలన స్థాపించాలనే సిద్ధాంతాన్ని ‘‘ఘజ్వా ఎ హింద్’’ సూచిస్తుంది. ఫిబ్రవరి 5న పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని రావల్కోట్లో ఉగ్రవాదుల సమావేశంలో కాశ్మీరీ అన్నారు.
Read Also: Vivo V70 Elite Look: ప్యాషన్ రెడ్లో అదిరిపోయే లుక్.. అందరి చూపులన్నీ ‘వివో వీ70 ఎలైట్’పైనే!
‘‘యుద్ధం మొదలైనప్పుడు, ఆయుధాలు బయటకు వచ్చాయి, యుద్ధ విమానాలు దాడి చేసుకున్నాయి. ట్యాంకులు ముఖాముఖిగా నిలబడ్డాయి. మన ఆర్మీ చీఫ్ దీనిని ఘజ్వా ఎ హింద్, అని, బున్యాన్ అల్ మర్సూస్ అని ప్రకటించాడు’’ అని కాశ్మీరీ చెప్పాడు. ఉగ్రవాదుల గుర్తింపు జిహాద్ అని, ప్రభుత్వం తమతో ఉన్నా లేకపోయినా మన లక్ష్యం జిహాద్ అని, కాశ్మీర్ను విముక్తి చేస్తామని చెప్పాడు.
జైషే ఉగ్రవాది ప్రకటనతో మరోసారి పాకిస్తాన్ ఆర్మీ, ఉగ్రవాదుల సంబంధాలు బయటపడ్డాయి. ఇటీవల నెలల్లో పాకిస్తాన్లోని పలువురు ఉగ్రవాదులు భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు. గతేడాది ఏప్రిల్ లో 26 మందిని బలిగొన్న పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, పాకిస్తాన్పై భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ ప్రారంభించింది. పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. ఈ దాడుల్లో వందకు పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. పాకిస్తాన్ కవ్వింపులకు దిగడంతో పాక్ వైమానిక దళానికి చెందిన 10కి పైగా ఎయిర్ బేసుల్ని భారత్ ధ్వంసం చేసింది.