ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్.. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే.సక్సేనాకు రాసిన లేఖ దుమారం రేపుతోంది. ఈ వ్యవహారాన్ని తీహార్ జైలు అధికారులు తీవ్రంగా పరిగణించారు. జైలు నిబంంధనలు ఉల్లంఘించడమేనని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ తీహార్ జైల్లో ఉంటున్నారు. మార్చి 21 నుంచి ఆయన జైల్లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 15న తనకు బదులుగా మంత్రి అతిషి చేత జెండా వందనం చేయించాలని లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనాకు లేఖ రాశారు. అయితే ఇలా లేఖ రాయడాన్ని తీహార్ జైలు అధికారులు తప్పపట్టారు. ఇది జైలు నిబంధనలు ఉల్లంఘించడమేని పేర్కొన్నారు. ఇలా లేఖలు బయటకు పంపడానికి వీలుండదని జైలు సూపరింటెండెంట్ తెలిపారు. అవసరమైతే మీ అధికారులను నియంత్రించవల్సి ఉంటుందని హెచ్చరించారు. రూల్ 588 ప్రకారం వ్యక్తిగత విషయాలకే పరిమితం ఉంటుందని తెలిపారు. ఆగస్టు 15కు సంబంధించిన లేఖ జైలు మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లేనని వివరించారు. కేజ్రీవాల్ రాసిన లేఖ ఆగస్టు 7న మీడియాకు విడుదలైంది. నిబంధనలు పాటించకుంటే ముఖ్యమంత్రి అధికారాలకు అడ్డుకట్ట వేయాల్సి వస్తుందని అధికారులు హెచ్చరించారు.
లిక్కర్ పాలసీ కేసులో మార్చి 21న ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ను తీహార్ జైలుకు తరలించారు. పలుమార్లు బెయిల్ పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయి. లోక్సభ ఎన్నికల సమయంలో మాత్రం ఎన్నికల ప్రచారం కోసం సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనంతరం జూన్ 2న తిరిగి తీహార్ జైల్లో లొంగిపోయారు. తాజాగా సుప్రీంకోర్టులో బెయిల్ కోసం అప్లై చేసుకున్నారు.