దేశవ్యాప్తంగా అగ్నిపథ్ స్కీమ్ ప్రకంపనలు పుట్టిస్తోంది. మొన్నబీహార్ లో మొదలైన ఆందోళనలు నెమ్మదిగా ఇతర రాష్ట్రాలకు కూడా వ్యాపిస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో ఆర్మీ ఆశావహులు రోడ్డెక్కారు. ముఖ్యంగా రైల్వే ఆస్తులను టార్గెట్ చేస్తూ విధ్వంసం చేస్తున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా 200పైగా ట్రైన్స్ పై ప్రభావం పడింది. ఇదిలా ఉంటే ఈ రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో నిరసనకారులు రైళ్లకు మంటపెట్టారు. హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారుల్ని చెదరగొట్టారు. ఈ ఘటనల్లో ఒకరు మరణించారు.
ఇదిలా ఉంటే అగ్నిపథ్ స్కీమ్ పై కేంద్ర మంత్రులు స్పందిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, క్రీడలు, యువజన శాఖ మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ అగ్నిపథ్ స్కీమ్ వల్ల దేశానికి, యువతకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. ఇండియన్ ఆర్మీ మరింత బలోపేతం అవుతుందని వాళ్లు అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉంటే తాజాగా కేంద్రం హోంమంత్రి అమిత్ షా అగ్నిపథ్ స్కీమ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యాప్తంగా జరుగుతున్న అల్లర్లపై స్పందించారు. గత రెండేళ్ళలో, కరోనా మహమ్మారి కారణంగా సైన్యంలో నియామక ప్రక్రియ ప్రభావితమైందని..ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ‘అగ్నిపథ్ యోజన’లో యువకుల ప్రయోజనాలను సంరక్షిస్తూ, అభ్యర్థుల వయోపరిమితిని మరో రెండేళ్లు పెంచారని అన్నారు. ప్రస్తుతం ఉన్న వయోపరిమితిని 21 ఏళ్ల నుంచి 23 ఏళ్లకు పెంచారని..దీని వల్ల యువత పెద్ద సంఖ్యలో ప్రయోజనం పొందుతుందని.. అగ్నిపథ్ స్కీమ్ ద్వారా వారు దేశానికి సేవ చేసే దిశలో ముందుకు వెళ్లారని అన్నారు. ఇదిలా ఉంటే సికింద్రాబాద్ లో చెలరేగిన హింసపై అమిత్ షా, కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో మాట్లాడారు. హింసకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీశారు.