జార్ఖండ్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఢిల్లీకి వెళ్తున్న ఎయిర్ అంబులెన్స్ కూలిపోయింది. అందులో ఉన్న ఏడుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

సోమవారం రాత్రి 7.11 గంటలకు రాంచీ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి వెళ్తున్న రెడ్బర్డ్ ఎయిర్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే చత్ర జిల్లాలోని సిమారియా సమీపంలో కూలిపోయింది. అయితే ప్రమాదంలో విమానంలో ఉన్న ఏడుగురు చనిపోయారని రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారి తెలిపారు.
రాత్రి 7:30 గంటల ప్రాంతంలో విమానం అదృశ్యమైందని చత్రా డిప్యూటీ కమిషనర్ కీర్తిశ్రీ వెల్లడించారు. సిమారియాలోని బరియాటు పంచాయతీ ప్రాంతంలో ఇది కూలిపోయిందని ఆమె తెలిపారు. విమానంలో ఉన్న ఏడుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు SDPO శుభం ఖండేల్వాల్ పేర్కొన్నారు. కెప్టెన్ వివేక్ వికాస్ భగత్, కెప్టెన్ సావ్రాజ్దీప్ సింగ్, సంజయ్ కుమార్, డాక్టర్ వికాస్ కుమార్ గుప్తా, సచిన్ కుమార్ మిశ్రా, అర్చన దేవి, ధురు కుమార్గా గుర్తించారు.
DGCA వెబ్సైట్ ప్రకారం.. ఢిల్లీకి చెందిన నాన్-షెడ్యూల్డ్ ఆపరేటర్ రెడ్బర్డ్ ఆరు విమానాలను కలిగి ఉంది. ఇందులో క్రాష్ అయిన విమానం కూడా ఉంది. రాంచీలోని దేవ్కమల్ హాస్పిటల్ CEO అనంత్ సిన్హా మాట్లాడుతూ.. ఎయిర్ అంబులెన్స్ రోగి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారని చెప్పారు.
‘‘లాతేహార్ జిల్లాలోని చాంద్వా నివాసి సంజయ్ కుమార్ (41) అనే రోగి ఫిబ్రవరి 16న 65 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్స కోసం ఢిల్లీకి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. సోమవారం ఎయిర్ అంబులెన్స్ ఏర్పాటు చేశారు. రోగి సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ఆస్పత్రి నుంచి ఢిల్లీకి బయలుదేరాడు.’’ అని అనంత్ సిన్హా అన్నారు.
టేకాఫ్ అయిన 20 నిమిషాలకే విమానం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో సంబంధాలు తెగిపోయాయని రాంచీ విమానాశ్రయ డైరెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ‘‘ప్రమాదానికి వాతావరణం బాగోలేకపోవడమే కారణం కావచ్చు. కానీ కచ్చితమైన కారణం దర్యాప్తు తర్వాతే తెలుస్తుంది.’’ అని అన్నారు.
ఇది కూడా చదవండి: Nellore Murder: ప్రియుడితో ఎంజాయ్ చేయొద్దన్నందుకు.. యమపురి పంపేసింది! మర్డర్ కేసులో షాకింగ్ నిజాలు..