AIADMK MLA Resignation: తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షమైన ఏఐఏడీఎంకేకు మరో భారీ రాజకీయ ఎదురుదెబ్బ తగిలింది. కరూర్ ఎమ్మెల్యే ఎంఆర్ విజయభాస్కర్ సోమవారం తమిళనాడు శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో పాటు పార్టీకి కూడా గుడ్బై చెప్పారు. 2026 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏఐఏడీఎంకేను వీడిన ఆరో ఎమ్మెల్యేగా ఆయన నిలిచారు. ఈ పరిణామం పార్టీ అధినేత పళనిస్వామికి మరింత ఇబ్బందికరంగా మారింది.
జయలలిత మంత్రివర్గంలో కీలక బాధ్యతలు
ఎంఆర్ విజయభాస్కర్ మాజీ ముఖ్యమంత్రి జె. జయలలిత మంత్రివర్గంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే నేత వి. సెంథిల్ బాలాజీ చేతిలో ఓడిపోయిన ఆయన, 2026 ఎన్నికల్లో తిరిగి కరూర్ నియోజకవర్గం నుంచి విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే, 2026 ఎన్నికల అనంతరం ఏఐఏడీఎంకే నుంచి ఎమ్మెల్యేల నిష్క్రమణలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి అధికార టీవీకేలో చేరగా, ఇటీవల పార్టీని వీడిన విరాలిమలై మాజీ ఎమ్మెల్యే సి. విజయభాస్కర్ కూడా త్వరలో సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకేలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేల రాజీనామా
ఎంఆర్ విజయభాస్కర్కు ముందు అంబాసముద్రం ఎమ్మెల్యే ఈశక్కి సుబయ్య, ధారాపురం ఎమ్మెల్యే పి. సత్యభామ, మదురాంతకం ఎమ్మెల్యే మరగతం కుమరవేల్, పెరుందురై ఎమ్మెల్యే ఎస్. జయకుమార్, విరాలిమలై ఎమ్మెల్యే సి. విజయభాస్కర్లు కూడా పార్టీకి, అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. వరుసగా ఎమ్మెల్యేలు పార్టీని వీడుతుండటంతో అసెంబ్లీలో ఏఐఏడీఎంకే బలం తగ్గడంతో పాటు పార్టీ భవిష్యత్తుపై కూడా చర్చ మొదలైంది.

