Tamilnadu: చీలిక దిశగా ఏఐఏడీఎంకే.. ఎమ్మెల్యేల తిరుగుబావుటా తప్పదా! కారణమిదేనా?

  • తమిళనాడు రాజకీయాలు మరో ఆసక్తికర అంశం
  • చీలిక దిశగా ఏఐఏడీఎంకే
  • పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు టీవీకేలో చేరేందుకు రంగం సిద్ధం
Aiadmk

Aiadmk

తమిళనాడు రాజకీయాలు మరోసారి ఆసక్తికరంగా మారబోతున్నాయా? విపక్ష పార్టీలో భారీ సంక్షోభం తలెత్తబోతుందా? మూకుమ్మడి తిరుగుబాటుకు రంగం సిద్ధమైందా? రెండు ఆకుల పార్టీ.. రెండుగా చీలిపోనుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఈసారి ఊహించని మార్పు కనిపించింది. ఎప్పుడూ డీఎంకే-ఏఐఏడీఎంకే పార్టీలే ప్రభుత్వాలు స్థాపించేవి. కానీ ఈసారి అందుకు భిన్నంగా కొత్తగా పార్టీ స్థాపించిన విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో దిగ్గజ పార్టీలు మట్టికరిచాయి. 108 సీట్లతో టీవీకే అతి పెద్ద పార్టీగా అవతరించింది. దీంతో చిన్న పార్టీల మద్దతుతో విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

ఇక డీఎంకే 59 స్థానాలు, ఏఐఏడీఎంకే 47 స్థానాలకు పరిమితం అయ్యాయి. అయితే రెండు ఆకులు కలిగిన అన్నాడీఎంకే పార్టీ రెండుగా చీలిపోబోతుందని వార్తలు వస్తున్నాయి. దాదాపు 30 మందికి పైగా ఎమ్మెల్యేలు తిరుగుబావుటా ఎగరవేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనికంతటికి పళనిస్వామినే కారణంగా చెబుతున్నారు. పార్టీ సీనియర్ నాయకుడు సి.వి. షణ్ముగంకు దగ్గరగా ఉన్న ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల బృందం ఒకటి పార్టీ అధినేత పళనిస్వామికి వ్యతిరేకంగా తిరుగుబావుటా ఎగరవేసినట్లు వార్తలు వస్తున్నాయి. పళనిస్వామి రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు. వరుస ఎన్నికల ఓటములు పార్టీలో చీలిక తెచ్చినట్లుగా సమాచారం.

అయితే ఏఐఏడీఎంకేలో చీలిక రాబోతుందన్న వార్తలను పళనిస్వామి తోసిపుచ్చారు. పార్టీ ఐక్యంగానే ఉందని పేర్కొన్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే నేతృత్వంలోని కూటమి ఒక దశాబ్దం తర్వాత ఏఐఏడీఎంకేను అధికారం నుండి పడగొట్టింది. ఆ పార్టీ కేవలం 75 సీట్లను మాత్రమే గెలుచుకుంది. తదనంతరం 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే 39 స్థానాలకు గాను కేవలం ఒకే ఒక్క సీటును గెలుచుకోగా.. 2024 పార్లమెంటరీ ఎన్నికల్లో ఆ పార్టీ కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది. ఈ వరుస ఎన్నికల పరాజయాలు ఈపీఎస్ రాజకీయ వ్యూహమే కారాణమని పార్టీలో ఆగ్రహాన్ని పెంచాయని వర్గాలు చెబుతున్నాయి. ఈ కారణంగానే ఈపీఎస్ వర్గానికి.. షణ్ముగం వర్గానికి మధ్య ఘర్షణ తలెత్తి దూరం పెరిగినట్లుగా తెలుస్తోంది.

షణ్ముగం నేతృత్వంలోని వర్గం.. విజయ్ పార్టీ అయిన తమిళగ వెట్టి కజగం (టీవీకే)తో పొత్తు పెట్టుకోవచ్చనే వదంతులు వచ్చాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీకి టీవీకేకు కేవలం కొన్ని సీట్లు మాత్రమే తక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో షణ్ముగంతో సహా 30 మందికి పైగా ఎమ్మెల్యేలు విజయ్ పార్టీలో చేరి మంత్రులుగా చేరాలని వ్యూహాలు రచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం తమిళనాడు వ్యాప్తంగా ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి.