మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో ట్విస్టులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటు సీఎం ఉద్ధవ్ వర్గం, అటు రెబెల్ నేత ఏక్ నాథ్ షిండే వర్గాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు టూరిజం మంత్రి ఆదిత్య ఠాక్రే, రెబెల్ నేత ఏక్ నాథ్ షిండేపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మే 20న, ఉద్ధవ్ ఠాక్రే, ఏక్ నాథ్ షిండేకు ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేశారని.. అయితే ఆ సమయంలో షిండే డ్రామాలు చేశారని ఆదిత్య ఠాక్రే అన్నారు. ఒక నెల తరువాత ఏక్ నాథ్ షిండే తిరుగుబాటు చేశారని ఆయన అన్నారు.
యువసేన జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ఆదిత్య ఠాక్రే.. ఇది తిరుగుబాటు కాదు, వేర్పాటువాదం అని విమర్శించారు. సీఎం ఉద్ధవ్ ఠాక్రే అనారోగ్యాన్ని ఆసరాగా చేసుకుని ఇదంతా చేశారని ఆరోపించారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలను దోశద్రోహులుగా పేర్కొన్నారు. శివసేనకు ద్రోహం చేసిన వారిని మహారాష్ట్ర ఎప్పటికీ క్షమించదని ఆయన అన్నారు.
పార్టీని వీడాలనుకే వారికి, తిరిగి రావాలనుకునే వారికి శివసేన తలుపులు తెరిచే ఉన్నాయని.. ద్రోహులుగా ఉన్న రెబెల్ ఎమ్మెల్యేలను మాత్రం తిరిగి పార్టీలోకి తీసుకోబోమని ఆదిత్య ఠాక్రే అన్నారు. పార్టీ నుంచి కొంత మురికి పోయిందని.. దమ్ముంటే రెబెల్ ఎమ్మెల్యేలు మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు.
శివసేనలో ఏక్ నాథ్ షిండే తిరుగుబాటులో ప్రభుత్వం పడిపోయే పరిస్థితి ఏర్పడింది. 39 మంది వరకు శివసేన ఎమ్మెల్యేలు షిండే వర్గంలో ఉన్నారు. మూడింట రెండొంతుల మంది ప్రస్తుతం షిండే క్యాంపులో ఉండటంతో పార్టీపై కూడా ఉద్ధవ్ ఠాక్రే పట్టు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. పదవి సంగతి తరువాత ముందుగా పార్టీని కాపాడుకునే పనిలో ఉద్ధవ్ వర్గం ఉంది. దీంతో వరసగా శివసేన జిల్లా అధ్యక్షులు, జాతీయ కార్యవర్గం సమావేశం, యువ కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నారు. ఏక్ నాథ షిండేకు మంచి పట్టు ఉన్న థానేలోని కార్యకర్తలు, కార్పొరేటర్లలో ఉద్ధవ్ ఠాక్రే భేటీ అవుతున్నారు.