Abhishek Banerjee: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఓటమి తర్వాత తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)లో భారీ సంక్షోభం ఏర్పడింది. రీటబ్రత బెనర్జీ నేతృత్వంలో మెజారిటీ ఎమ్మెల్యేలు మమతా బెనర్జీపై తిరుగుబాటు చేశారు. ఇక 20 మంది ఎంపీలు టీఎంసీకి గుడ్బై చెప్పారు. తిరుగుబాటు నేతలు మమత మేనల్లుడు, డైమండ్ హార్బర్ ఎంపీ అభిషేక్ బెనర్జీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎంసీ ఓటమికి ఆయనే కారణమని ఆరోపించారు.
ఇదిలా ఉంటే, అభిషేక్ బెనర్జీ రాజీనామాకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తిరుగుబాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు తిరిగి మమతా బెనర్జీ వైపు తిరిగి వస్తే, తనతో ఏదైనా సమస్య ఉంటే రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరుగుతోందని, తనను తిడితే ఈడీ, సీబీఐల నుంచి వారికి రక్షణ లభిస్తుందనే హామీ లభించిందని అన్నారు.
‘‘నాపై మీకు అభ్యంతరాలు ఉంటే, మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీలోకి తిరిగి రండి. మీరు తిరిగి వచ్చిన గంటలోనే నేను నా పదవికి రాజీనామా చేస్తాను’’ అని అభిషేక్ బెనర్జీ ప్రకటించారు. పార్టీ ఓటమికి నేను బాధ్యుడిన అని చెబితే, 2024 లోక్సభ ఎన్నికల్లో టీఎంసీ సాధించిన విజయానికి కూడా నాకు క్రెడిట్ ఇవ్వాలి కదా అని ప్రశ్నించారు. ఓటమికి బాధ్యత నాదైతే, విజయానికి కీర్తి కూడా నాదే కావాలి అని అభిషేక్ బెనర్జీ అన్నారు. జూలై 19,20,21 ఏ రోజైనా తిరిగి టీఎంసీలో చేరాలని తిరుగుబాటు ఎమ్మెల్యేలకు ఆయన పిలుపునిచ్చారు.

