AAP: లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలోని ఏడు ఎంపీ స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), కాంగ్రెస్లు కలిసి పోటీ చేశాయి. అయితే, ఈ ఎన్నికల్లో ఇరు పార్టీలు కూడా ఒక్క స్థానాన్ని సొంతం చేసుకోలేదు. ఢిల్లీని మరోసారి బీజేపీ క్లీన్స్వీప్ చేసింది. అయితే, ఈ రెండు పార్టీల పొత్తు గురించి ఆప్ నేత, మంత్రి గోపాల్ రాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేస్తామని గురువారం ఆప్ తరుపున ఆయన స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల కోసమే పొత్తు పెట్టుకున్నామని, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు ఉండదని గోపాల్ రాయ్ అన్నారు.
READ ALSO: Bihar: పాట్నా-జార్ఖండ్ ప్యాసింజర్ రైల్లో అగ్నిప్రమాదం.. తగలబడ్డ బోగీలు
గురువారం ఢిల్లీలో ముఖ్యమంత్రి నివాసంలో ఆప్ ఎమ్మెల్యేల సమావేశం జరిగిన తర్వాత ఈ ప్రకటన వచ్చింది. ఈ సమావేశంలో, ఆప్ శాసనసభ్యులు ప్రతి శని, ఆదివారాల్లో తమ తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులను పునఃప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. లోక్సభ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున ఢిల్లీలో అభివృద్ధి పనులు ఆగిపోయానని గోపాల్ రాయ్ అన్నారు. శనివారం ఢిల్లీ కౌన్సిలర్ల సమావేశానికి ఆప్ పిలుపునిచ్చింది. జూన్ 13న పార్టీ కార్యకర్తలు సమావేశం కానున్నారు.