NTV Telugu Site icon

Haryana Polls: 20 మందితో తొలి జాబితా విడుదల చేసిన ఆప్

Kejriwal

Kejriwal

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసే అంశంపై కాంగ్రెస్‌తో ఆమ్ ఆద్మీ పార్టీ సుదీర్ఘ మంతనాలు జరిపింది. కానీ చర్చలు మాత్రం ఓ కొలిక్కి రాలేదు. ఇంకోవైపు సునీతా కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారం కూడా మొదలెట్టేశారు. ఈ నేపథ్యంలో రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందా? లేదా? అనేది మాత్రం తేలలేదు. మొత్తానికి ప్రతిష్టంభన మధ్య ఆప్ సోమవారం తొలి జాబితాను విడుదల చేసేసింది. 20 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ప్రకటించింది.

కలయత్ స్థానం నుంచి అనురాగ్ ధండా, సమల్ఖా నుంచి బిట్టు పహల్వాన్, రోహ్‌తక్ నుంచి బిజేందర్ హుడా, ఉచన కలాన్ నుంచి పవన్ ఫౌజీతో సహా 20 మంది పేర్ల జాబితాను ఆప్ విడుదల చేసింది. కాంగ్రెస్‌తో కలిసి ఆప్ పోటీ చేయాలని భావించింది. కానీ కాంగ్రెస్ ఆశించిన స్థాయిలో సీట్లు ఇచ్చేందుకు నిరాకరించింది. ఆప్ 10 సీట్లు అడిగితే.. 5-6 సీట్లు కంటే ఎక్కువ ఇచ్చేందుకు హస్తం పార్టీ మొగ్గు చూపలేదు. దీంతో పొత్తులు ఫలించలేదు. శనివారం ఒంటరిగానే అన్ని సీట్లలో పోటీ చేస్తామని ఆమ్ ఆద్మీ ప్రకటించింది. అన్నట్టుగానే సోమవారం 20 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేసింది.

ఇక ఆదివారం హర్యానా అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల రెండో జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. ఒక రోజు గ్యాప్ తర్వాత ఆప్ కూడా జాబితాను విడుదల చేసింది. ఉచన కలాన్ నుంచి బ్రిజేంద్ర సింగ్, గురుగ్రామ్ నుంచి మోహిత్ గ్రోవర్, గనౌర్ నుంచి కుల్దీప్ శర్మ, థానేసర్ నుంచి అశోక్ అరోరా, తోహానా నుంచి పరమవీర్ సింగ్ సహా తొమ్మిది పేర్లను జాబితాలో పేర్కొన్నారు. బీజేపీకి చెందిన దుష్యంత్ చౌతాలాతో బ్రిజేందర్ సింగ్ తలపడతున్నారు.

తొలి జాబితాను కాంగ్రెస్ గత వారం శుక్రవారం విడుదల చేసింది. ఒలింపిక్ రెజ్లర్ వినేష్ ఫోగట్, మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ హుడా సహా 31 మంది అభ్యర్థులను జాబితాలో పేర్కొన్నారు. కొన్ని గంటల ముందు అధికారికంగా పార్టీలో చేరిన ఫోగట్ – జులనా నుంచి పోటీ చేస్తున్నారు. ఇక భారతీయ జనతా పార్టీ కూడా తొలి జాబితాను విడుదల చేసింది. తొలి జాబితాలో ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ సహా 67 మంది పేర్లు ఉన్నాయి. ఆయన లాడ్వా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండగా.. బీజేపీ అంబాలా కంటోన్మెంట్ స్థానం నుంచి మాజీ మంత్రి అనిల్ విజ్‌ను బరిలోకి దింపింది.

హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అక్టోబర్ 5న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం అక్టోబర్ 8న విడుదల కానున్నాయి. ఇప్పుడు మూడు పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, ఆప్ మధ్య ఢీ అంటే ఢీ అనే ఫైటింగ్ ఉండనుంది.